IND vs AUS T20I: ఉప్పల్ టీమిండియాకు అనుకూలమేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
Uppal Stadium: మూడేండ్ల తర్వాత టీమిండియా హైదరాబాద్లో మ్యాచ్ ఆడనున్నది. నేటి రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. మరి ఉప్పల్ టీమిండియాకు అనుకూలమేనా..?
సుమారు మూడేండ్ల తర్వాత ఉప్పల్లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా చెరో మ్యాచ్ గెలిచిన ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య సిరీస్ విజేత ఎవరో ఉప్పల్ లో తేలనుంది. ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియా-ఆసీస్ మధ్య తుది పోరు జరుగనున్నది. ఈ నేపథ్యంలో అసలు ఉప్పల్ స్టేడియం టీమిండియాకు అనుకూలమేనా..? భారత్ ఇక్కడ గతంలో ఎన్ని మ్యాచ్ లు ఆడింది.. విజయాలెన్ని.. అపజయాలెన్ని..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్ లో అప్పటివరకు ఉన్న ఎల్బీ స్టేడియం నగరం నడిబొడ్డున ఉండటమే గాక చిన్నదిగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లు నిర్వహించడం కష్టమయ్యేది. దీంతో 2003లో ఉప్పల్ లో స్టేడియం నిర్మాణానికి (16 ఎకరాలలో) అడుగులుపడ్డాయి. రెండేండ్ల తర్వాత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్టేడియంలో ఆ ఏడాది నుంచే మ్యాచ్ లు జరుగుతున్నాయి. స్టేడియం సామర్థ్యం 55 వేలు.
ఇప్పటివరకు ఉప్పల్ లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, 2 టీ20లు జరిగాయి. ఐదు టెస్టులలో భారత్.. నాలుగింటిలో నెగ్గింది. ఒక టెస్టు డ్రా గా ముగిసింది. వన్డేల విషయానికొస్తే ఆరు వన్డేలలో మూడు గెలిచి మూడింటిలో ఓడింది. రెండు టీ20లకు ఆతిథ్యమిచ్చినా వర్షం కారణంగా 2019లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. అదే ఏడాది డిసెంబర్ 6న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
- తొలి అంతర్జాతీయ మ్యాచ్ : 2005 నవంబర్ 16న (దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓడింది)
- 2019లో టీ20కి ఆతిథ్యం. వెస్టిండీస్ తో జరిగిన ఆ మ్యాచ్ లో టీమిండియాదే విజయం
- ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ మీద సెంచరీ చేయడానికంటే ముందు టీ20లలో కోహ్లీ అత్యధిక స్కోరు (122) ఈ వేదిక మీదే ఉండేది. వెస్టిండీస్ తో ముగిసిన టీ20లో కోహ్లీ.. 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు.
భారత్-ఆస్ట్రేలియాలు ఉప్పల్ లో నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో మూడు వన్డేలు, ఒక టెస్టు (ఒక టీ20 వర్షం కారణంగా రద్దయింది) ఆడాయి. 2007, 2009లో ఇక్కడ ఆస్ట్రేలియాతో రెండు వన్డేలు ఆడిన భారత్ రెండింటిలోనూ ఓడింది. కానీ 2019లో మాత్రం విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో భారత్ నే విజయం వరించింది.
సాధారణంగా హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. నేటి మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ పిచ్ తయారుచేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే దీంతో మొహాలీలో మాదిరిగానే ఈ మ్యాచ్ లో కూడా పరుగుల వర్షం కురవడం ఖాయం. గత రికార్డులు ఎలా ఉన్నా సొంత ప్రేక్షకుల సమక్షంలో టీమిండియా రెచ్చిపోయి సిరీస్ ను చేజిక్కించుకోవాలని భాగ్యనగర ప్రజలు కోరుకుంటున్నారు. అయితే టికెట్ల వివాదంలో విమర్శలు ఎదుర్కున్న హెచ్సీఎ.. మ్యాచ్ నిర్వహణను ఎలా చూసుకుంటుందనేదనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.