కేకేఆర్కు వరుస షాకులు.. ఇప్పటికే కెప్టెన్ మిస్.. స్టార్ ఆటగాళ్లు కూడా దూరం..!
IPL 2023: రాబోయే ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్ ఆడేది అనుమానంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పడు స్టార్ ఆటగాళ్లు కూడా దూరం కానున్నారు.

మరో పది రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-16 సీజన్ కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇదివరకే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా వచ్చే సీజన్ లో ఆడేది అనుమానంగానే ఉండగా తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ తో పాటు మరో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.
కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ బంగ్లా ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్.. స్వదేశంలో ఐర్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆడుతోంది.
ఐర్లాండ్ -బంగ్లాదేశ్ ల నడుమ మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక టెస్టు జరగాల్సి ఉంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లలో షకిబ్ తో పాటు లిటన్ దాస్ కూడా ఉన్నాడు. ఐర్లాండ్ - బంగ్లాదేశ్ ల మధ్య సిరీస్ లు ముగిసేసరికి ఏప్రిల్ 9 కానుంది. అప్పటికే ఐపీఎల్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ లు ముగిసేదాకా బంగ్లాదేశ్.. షకిబ్, దాస్ లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుస్తున్నది.
వెన్నునొప్పి గాయం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడని.. లేకుంటే కనీసం ఫస్టాఫ్ వరకైనా దూరం కానున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన షకిబ్ అల్ హసన్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పుతారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు హసన్ కూడా ఈ సీజన్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నాడని తెలియడంతో కేకేఆర్ అభిమానులు షాక్ లో మునిగిపోయారు.
అయ్యర్ తో పాటు షకిబ్ కూడా దూరం కావడంతో మరి కేకేఆర్ కెప్టెన్ ఎవరు..? అన్న ప్రశ్న ఆ జట్టును వేధిస్తోంది. మూడు రోజుల క్రితం ఆ జట్టు బ్యాటర్ రింకూ సింగ్ ను కేకేఆర్ సారథిగా నియమించనుందని కూడా వార్తలు వినిపించాయి. ఈ మేరకు కేకేఆర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఓ ఫ్యాన్ పోస్టుకు రిప్లై ఇస్తూ ఈ విషయాన్ని తెలిపిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అసలు కేకేఆర్ సారథి ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా.. ఐర్లాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. షకిబ్ అల్ హసన్ (93), తౌవీద్ హృదయ్ (92) లు రాణించారు. చివర్లో ముష్ఫీకర్ రహీమ్ (26 బంతుల్లో 44) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.