IPL 2023: ఈ నెల చివరివారంలో మొదలుకాబోయే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు  బీసీసీఐకి భారీ షాకిచ్చింది. తమ ప్లేయర్లను  పంపలేమంటూ బీసీసీఐకి లేఖ రాసినట్టు తెలుస్తున్నది. 

ఈనెల 31 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ - 16 కు ముందే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఎ) బీసీసీఐకి షాకిచ్చింది. ఐపీఎల్ లో ప్రారంభ మ్యాచ్ లకు తమ ఆటగాళ్లను పంపలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో తమ దేశంలో మరో సిరీస్ ఉన్నందున ఆటగాళ్లందరూ అందులోనే ఆడడం తమకు అత్యావశ్యకమని.. అందుకే తాము ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటామని తెలిపింది. ఇది ఐపీఎల్ లో ఆరు ఫ్రాంచైజీలకు షాకింగ్ న్యూసే. 

ఐపీఎల్ ప్రారంభ సమయానికే దక్షిణాఫ్రికాలో నెదర్లాండ్స్ తో రెండు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ లు నెగ్గడం సఫారీలకు చాలా అవసరం. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించాలంటే ఆ జట్టుకు ఈ సిరీస్ లో గెలుపొందడం అత్యావశ్యకం. 

మార్చి 31 నుంచి నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా రెండు వన్డేల సిరీస్ మొదలుకానుంది. బెనోని, జోహన్నస్‌బర్గ్ వేదికగా రెండు వన్డేలు జరుగుతాయి. ఈ మ్యాచ్ ల కోసం దక్షిణాఫ్రికా పూర్తిస్థాయి జట్టును బరిలోకి దించాలని భావిస్తున్నది. ఎయిడెన్ మార్క్‌రమ్, అన్రిచ్ నోర్త్జ్, డేవిడ్ మిల్లర్, కగిసొ రబాడా, హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డికాక్ వంటి ప్లేయర్లంతా నెదర్లాండ్స్ తో సిరీస్ ఆడనున్నారు. 

ఈ నేపథ్యంలో తొలి వారం రోజుల పాటు ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లకు వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్న తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని.. సీఎస్ఎ, బీసీసీఐకి తెలియజేసింది. దీనికి బీసీసీఐ కూడా సమ్మతించినట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

Scroll to load tweet…

ఈ నిర్ణయంతో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (నోర్త్జ్, లుంగి ఎంగిడి), ముంబై ఇండియన్స్ (ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్), గుజరాత్ టైటాన్స్ (డేవిడ్ మిల్లర్), లక్నో సూపర్ జెయింట్స్ (క్వింటన్ డికాక్), పంజాబ్ కింగ్స్ (రబాడా) లు తొలి రెండు మ్యాచ్ లకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటి కంటే ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న మార్క్‌రమ్ లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్ లకు ఎవరు సారథిగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మార్క్‌రమ్ తో పాటు మార్కో జాన్సేన్, హెన్రిచ్ క్లాసెన్ కూడా సన్ రైజర్స్ సభ్యుడే కావడం గమనార్హం.