Virat Kohli's 100Th Test: ఒక వ్యక్తిని అభిమానిస్తే ఆ అభిమానం ఏ స్థాయికి వెళ్తుందో భారత్ లో ఉన్న సెలబ్రిటీలకు బాగా తెలుసు. ఇది క్రికెట్ లో కూడా మినహాయింపేమీ కాదు. సచిన్ తర్వాత అంత ఫ్యాన్ బేస్ ఉన్న కోహ్లి కూడా... 

మొహాలీలో శ్రీలంకతో ఆడుతున్న టెస్టులో అయినా సెంచరీ సాధించి రెండున్నరేండ్లుగా తాము కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నప్పటికీ కోహ్లి మాత్రం అతడి అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు. సెంచరీ సంగతి దేవుడెరుగు.. కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొందరు కోహ్లి ‘వీరాభిమానులు..’ తమ అభిమాన ఆటగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు కోహ్లి తమను వేచి చూసేలా చేస్తాడు..?మండిపడుతున్నారు. భారత్ వంటి దేశంలో ఒక వ్యక్తిని అభిమానిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అయినా సదరు వ్యక్తులు భరించాల్సిందే అనేదానికి ఒకప్పుడు సచిన్ ఉదాహరణ అయితే ఇప్పుడు ఆ ప్లేస్ కోహ్లిది. 

శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో కోహ్లి 76 బంతుల్లో 45 పరుగులు చేసి ఎంబుల్డెనియా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వందో టెస్టు ఆడుతున్న ఉత్సాహంతో క్రీజులోకి రాగానే జోరు మీద కనిపించిన కోహ్లి.. ఉన్నంతసేపు సాధికారికంగానే బ్యాటింగ్ చేశాడు. కాగా టెస్టులు, వన్డేలు కలిపి సుమారు 70 ఇన్నింగ్సులలో కోహ్లి సెంచరీ చేయలేదు. ఒక్క సెంచరీ చేస్తే అతడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (71) తో సమమవుతాడు. ఇన్నాళ్లు కెప్టెన్సీ భారం వల్ల సెంచరీలు చేయడం లేదని ఫ్యాన్స్ అనుకున్నా.. ఇప్పుడు అది కూడా లేదు. కానీ కోహ్లి మాత్రం ఇప్పటికీ 40, 50 లు మాత్రమే చేసి తన అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. తన కెరీర్ లో వందలాది రికార్డులు సాధించిన విరాట్.. వందో టెస్టులో సెంచరీ చేసి.. ఆ ఘనత సాధించిన భారత క్రికెటర్ అవుతాడని అతడి అభిమానులు ఎంతగానో ఆశించారు. 

కానీ లంకతో మ్యాచులో ఎంబుల్డెనియా వేసిన ఇన్నింగ్స్ 43.3 ఓవర్లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ట్విట్టర్ వేదికగా అతడి అభిమానుల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియలో వైరల్ అవుతున్నాయి. పలువురు కోహ్లి ఫ్యాన్స్ కూడా తమ అభిమాన ఆటగాడు వందో టెస్టులో సెంచరీ చేయకపోవడంపై నిరాశను వ్యక్తపరుస్తూ ట్వీట్ లు పెడుతున్నారు. 

Scroll to load tweet…

2019లో సెంచరీ చేసిన కోహ్లి.. మళ్లీ అప్పట్నుంచి శతకం కొట్టలేదు. మధ్యలో పలుమార్లు 70, 80లలోకి వచ్చినా ఆ స్కోర్లను శతకాలుగా మలచడంలో విఫలమయ్యాడు. కోహ్లి సెంచరీ చేస్తే చూడాలని ఎంతో కాలంగా ఆశపడుతున్న అతడి అభిమానులకు మరోసారి నిరాశను మిగుల్చుతూ.. లంకతో తొలి టెస్టులో కూడా 45 పరుగులకే వెనుదిరిగాడు ఈ పరుగుల యంత్రం.

Scroll to load tweet…

అయితే వందో టెస్టు ఇప్పుడే ముగిసిపోలేదని, తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయకపోయినా అతడు రెండో ఇన్నింగ్స్ లో దానిని పూర్తి చేస్తాడని భావిస్తూ ఆశావాహ దృక్పథంతో ఉన్న అభిమానులు కూడా ట్వీట్లు పెడుతున్నారు. నిజమైన అభిమానులు అంటే వీళ్లేనేమో...!