కివీస్తో దారుణ ఓటమి.. లంక సారథి సంచలన నిర్ణయం.. కొత్తవారిని చూసుకోవాలని..!
Dimuth Karunaratne: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంకకు టెస్టు జట్టు సారథి దిముత్ కరుణరత్నె భారీ షాకిచ్చాడు. కివీస్ తో రెండు మ్యాచ్ లలో ఓడిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఆర్థిక సంక్షోభాల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న లంక క్రికెట్ కు ఆ దేశ టెస్టు జట్టు సారథి దిముత్ కరుణరత్నె షాకిచ్చాడు. తాను సారథిగా కొనసాగలేనని, కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాలని లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ని కోరాడు. వచ్చే నెలలో ఐర్లాండ్ పర్యటన తర్వాత తాను సారథిగా తప్పుకుంటానని, కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ట్యటీసీ) షెడ్యూల్ కు కొత్త సారథిని నియమించుకోవాలని ఎస్ఎల్సీకి సూచించాడు.
కివీస్ తో రెండో టెస్టులో ఓడిన తర్వాత కరుణరత్నె ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ విషయం (రిటైర్మెంట్) గురించి నేను ఇదివరకే సెలక్టర్లతో మాట్లాడాను. ఐర్లాండ్ సిరీస్ తర్వాత నేను సారథిగా తప్పుకుంటానని వారితో చెప్పాను. వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ లో కొత్త సారథితో వెళ్తేనే జట్టుకు మంచిది...
నేను కొన్నాళ్లు సారథిగా ఉండి మళ్లీ తర్వాత మరొకరు జట్టును నడిపించడం గందరగోళానికి దారి తీస్తుంది. దీని గురించి సెలక్టర్లకు వివరంగా చెప్పా. కానీ నాకు వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు..’అని చెప్పాడు. ఇక న్యూజిలాండ్ పర్యటన తర్వాత శ్రీలంక.. ఏప్రిల్ 16 నుంచి 28 మధ్య రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత సారథిగా తప్పుకుంటానని కరుణరత్నె వెల్లడించాడు. కెప్టెన్ గా తప్పుకున్నా జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని కరుణరత్నె చెప్పాడు.
కాగా లంకకు 2019 లో టెస్టు సారథ్య పగ్గాలను చేపట్టిన కరుణరత్నె.. ఇప్పటివరకు 26 మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 10 విజయాలు, ఏడు డ్రాలు, 9 అపజయాలున్నాయి. తాను కెప్టెన్ గా నియమితుడయ్యాక 2019లో సౌతాఫ్రికాపై వారి గడ్డమీద టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో ఓడించడం కరుణరత్నె కెరీర్ లో చారిత్రాత్మక విజయంగా నిలిచిపోయింది. స్వదేశంలో గతేడాది ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు సిరీస్ తో పాటు, పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ ను కాపాడుకున్నాడు.
మొత్తంగా తన టెస్టు కెరీర్ లో 84 టెస్టులు ఆడిన కరుణరత్నె.. 39.94 సగటుతో 6,230 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, 34 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టులు గాక లంక తరఫున 34 వన్డేలు ఆడిన అతడు.. 767 రన్స్ సాధించాడు.
ఇదిలాఉండగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో లంక.. ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం లంక తొలి ఇన్నింగ్స్ లో 164, రెండో ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది.