‘మమ్మల్ని ఇలా కష్టాల్లో వదిలేయకండి... ఆఫ్ఘాన్లను చంపడం ఆపేయండి... ఆఫ్ఘనిస్తాన్ను నాశనం చేయకండి... మాకు శాంతి కావాలి...’ అంటూ రషీద్ ఖాన్ ట్వీట్..
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కాబూల్లోకి ప్రవేశించిన తాలిబన్ల తాకిడిని తట్టుకోలేక, వారికి అధికారం అప్పగించి... దేశం విడిచి వెళ్లిపోయాడు ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. తాలిబన్లు అధికారంలోకి రావడంతో దేశం విడిచిపోయేందుకు ఆఫ్ఘాన్ ప్రజలు క్యూలు కడుతున్నారు. దీంతో కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిసలాట జరిగి, వైమానిక సేవలు కూడా నిలిచిపోయాయి.
ఆఫ్ఘాన్లో జరుగుతున్న సంఘటనలు యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘నాకు నిద్రపట్టడం లేదు... శాంతి కావాలి... ’ అంటూ అల్లాను ప్రార్థిస్తున్నట్టుగా ఎమోజీలను పోస్టు చేశాడు రషీద్ ఖాన్.
‘డియర్ వరల్డ్ లీడర్స్, నా దేశం కష్టాల్లో ఉంది. వేల సంఖ్యలో అమాయక ప్రజలు, చిన్నపిల్లలు, మహిళలు.. రోజూ ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలను వలసెల్లిపోయాయి. మమ్మల్ని ఇలా కష్టాల్లో వదిలేయకండి... ఆఫ్ఘాన్లను చంపడం ఆపేయండి... ఆఫ్ఘనిస్తాన్ను నాశనం చేయకండి... మాకు శాంతి కావాలి...’ అంటూ వారం రోజుల క్రితం ట్వీట్ చేశాడు రషీద్ ఖాన్..
రషీద్ ఖాన్ తండ్రి చాలా ఏళ్ల క్రితమే చనిపోయా, తల్లి రషీద్ జానా గత ఏడాది అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. అనేక క్రికెట్ టీ20 లీగ్లు ఆడే రషీద్ ఖాన్, గత ఐదేళ్లలో ఇంటికి వెళ్లింది ఐదంటే ఐదు రోజులట.
‘రషీద్ ఖాన్ స్వదేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. అతను చాలా భయడుతున్నాడు. అంతకుమించి చాలా బాధలో ఉన్నాడు. ఆఫ్ఘాన్లో ఉన్న తన కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురావడానికి కూడా అవకాశం దొరకడం లేదు... వాళ్లకేమవుతుందోననే కంగారు, భయం అతని కళ్లల్లో కనిపిస్తోంది...
అయినా అదేమీ తన ప్రదర్శనలో కనిపించడం లేదు. గుండెల్లో ఎంతో బాధను దాచుకుని, తన ప్రొఫెషనల్ కెరీర్ను కొనసాగిస్తున్నాడు. అతని గుండె ధైర్యానికి సలాం చెప్పాల్సిందే’ అంటూ కామెంట్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాల్గొంటున్నాడు...
