ఒకే దెబ్బకు రెండు జట్లు ఔట్.. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇదే గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్..
AFG vs BAN: టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొదటి సారి సెమీ ఫైనల్ కు చేరుకుంది. కీలకమైన సూపర్-8 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ తో పాటు గ్రూప్-1లో సెమీఫైనల్కు అర్హత సాధించిన రెండో జట్టుగా ఆఫ్ఘన్ నిలిచింది. ఒకే దెబ్బతో రెండు జట్లను ఔట్ చేసింది.
![AFG vs BAN: Two teams out for one hit.. This is the most thrilling match in T20 World Cup 2024 RMA AFG vs BAN: Two teams out for one hit.. This is the most thrilling match in T20 World Cup 2024 RMA](https://static-ai.asianetnews.com/images/01j17013t7zbjt6fypvc9rx6z0/afg-t20-jpg_363x203xt.jpg)
AFG vs BAN T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024లో అత్యంత ఉత్కంఠమైన.. సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే సూపర్-8 లో బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనే చెప్పాలి. మ్యాచ్ ప్రారంభం నుంచి ఎన్నో మలుపులు, ఎన్నో నాటకలు కనిపించాయి. మ్యాచ్ ఇరు జట్ల వైపు మలుపులు తిరుగుతూనే చివరి వరకు వచ్చింది. అద్భుతమైన ఫీల్డింత్, బౌలింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సూపర్-8 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్పై 8 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ విజయాన్ని అందుకుంది. టీ20 ప్రపంచ కప్ లో తొలిసారి సెమీస్ చేరుకుని చరిత్ర సృష్టించింది.
ఒకే దబ్బకు రెండు పిట్టలు అనేలా ఒకే దెబ్బకు రెండు జట్లను దెబ్బకొట్టింది ఆఫ్ఘనిస్తాన్. అవే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచి వుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి చేరుకుని ఉండేది. దీంతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకుని ఉండేది. ఎందుకంటే ఇరు జట్లకు సమాన పాయింట్లు లభించినా మెరుగైన రన్ రేటు మాత్రం ఆస్ట్రేలియాకే ఉంటుంది. కాబట్టి కీలకమైన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుచేయడంతో పాటు ఆస్ట్రేలియాను కూడా ఆఫ్ఘన్ టీమ్ ఇంటికి పంపించింది. కంగారుల సెమీస్ ఆశలపై నీళ్లుజల్లింది. టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి భారత్ తో పాటు ఆఫ్ఘన్ టీమ్ సెమీ ఫైనల్ కు చేరుకుంది.
గ్రూప్-1 నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక గ్రూప్-2 నుంచి ఆక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఇక ఇప్పుడు సెమీస్ చేరుకున్న ఆఫ్ఘన్ జట్టు ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గెలిచిన జట్లు నేరుగా ఫైనల్ మ్యాచ్ లో తలపడతాయి.
టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు గల్లంతు
కాగా, బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు గానూ 114 పరుగుల టార్గెట్ ను నిర్ణయించాడు. కానీ, బంగ్లాజట్టు ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ను పలుమార్లు వర్షం అడ్డుకుంది. ఆరంభంలో మ్యాచ్ ఆఫ్ఘన్ వైపు ఉండగా, మధ్యలో ఇరు జట్ల వైపు దోబుచులాడింది.
లిట్టన్ దాస్ అద్భుతమైన నాక్ తో చివరలో బంగ్లాదేశ్ వైపు మ్యాచ్ వెళ్లింది. బంగ్లా చేతిలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు కావాలి. ఇలాంటి సమయంలో దాదాపు బంగ్లాదే విజయం పక్కా అనే సమీకరణల మధ్య ఆఫ్ఘన్ ప్లేయర్లు తమ పోరాటం ఏమాత్రం ఆపలేదు. చివరలో నవీన్-ఉల్-హక్ 17 ఓవర్ 4 బంతికి తస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ తో ఔట్ చేశాడు. సంబరాలు మొదలయ్యాయి. ఇంకా ఒక్క వికెట్ మాత్రమే గెలుపోటముల మధ్య ఉంది. తర్వాత బంతికి ముస్తాఫిజుర్ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ పంపి నవీన్-ఉల్-హక్ ఆఫ్ఘన్ జట్టుకు విజయాన్ని అందించాడు. కీలక సమయంలో 4 వికెట్లు తీసుకున్న నవీన్-ఉల్-హక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు