India Vs Srilanka 1st Test: క్రికెట్ లో మ్యాచులకు ముందు అంచనా (ప్రిడిక్ట్) వేయడం కొత్తేం కాదు. ఒక జట్టు ఎంత స్కోర్ చేస్తుంది..? ఒక బ్యాటర్ ఎన్ని పరుగులు చేయొచ్చు..? బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు..? అనేది వాళ్ల ఫామ్ ఆధారంగా చెప్పొచ్చు.. కానీ..
వందో టెస్టు ఆడుతున్న కోహ్లి.. ఈ ప్రతిష్టాత్మక సెంచరీలో అయినా రెండేండ్లుగా చేయని 71వ సెంచరీని చేస్తాడని అతడి ఫ్యాన్స్ ఆశించారు. కానీ కోహ్లి మాత్రం వాళ్లను మరోసారి నిరాశకు గురి చేస్తూ హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అయితే లంకతో టెస్టుకు సరిగ్గా పది గంటల ముందు ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్.. కోహ్లి ఎన్ని పరుగులు చేస్తాడు..? ఎవరు ఔట్ చేస్తారు...? అనేది అంచనా వేశాడు. అదేం విచిత్రమో గానీ కోహ్లి.. అతడు ఊహించిందే నిజం చేశాడు. కోహ్లి ఔటైన నేపథ్యంలో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతున్నది.
సదరు ట్వీట్ కు సంబంధించి.. శృతి#100 అనే ప్రొఫైల్ పేరుతో ఉన్న ఓ యూజర్ శుక్రవారం వేకువ జామున 12.46 గంటలకు ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘కోహ్లి తన వందో టెస్టులో వంద పరుగులు చేయడు. అతడు 45 పరుగులు చేస్తాడు. అందులో నాలుగు కళ్లు చెదిరిపోయే కవర్ డ్రైవ్ ఫోర్లు ఉంటాయి. లంక బౌలర్ ఎంబుల్డెనియా బౌలింగ్ లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అవుతాడు. దాంతో అతడు షాక్ కు గురవుతాడు..’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆ ట్విట్టర్ యూజర్ చెప్పినట్టే.. ఈ మ్యాచులో కోహ్లి 45 పరుగులే చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ట్వీట్ లో పేర్కొన్నట్టుగా.. 4 ఫోర్లు కాకుండా కోహ్లి 5 ఫోర్లు కొట్టాడు. అయితే ఎంబుల్డెనియా బౌలింగ్ లోనే కోహ్లి బౌల్డ్ అవడం విశేషం.
ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాక్షాత్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ ట్వీట్ చూసి నోరెళ్లబెట్టాడు. ఇదే విషయమై పలువురు నెటిజన్లు కూడా షాక్ లో ఉన్నారు. ‘ఎవరు ఔట్ చేస్తారనేది అంచనా వేయడం ఓకే. కానీ స్కోర్ కూడా అంత కచ్చితంగా ఎలా..? ఈ సీక్రెట్ ఏదో మాకూ చెప్పరాదు...’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘నాకు ఎంతమంది పిల్లలు పుడతారో చెప్పు ప్లీజ్..’ అని ‘నాకు జాబ్ వస్తుందా..? రాదా..?’ అని ‘నేను ఏ స్టాక్స్ కొనాలో చెప్పు..?’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
