India First Test Match: జూన్ 25తో భారత క్రికెట్ కు ప్రత్యేక అనుబంధముంది.  ఈ రోజున భారత క్రికెట్ లో రెండు అపురూప ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. 

భారత క్రికెట్‌కు జూన్ 25తో ప్రత్యేక అనుబంధముంది. ఈరోజున టీమిండియా.. తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. దానికి నేటితో 40 ఏండ్లు పూర్తయ్యాయి. కానీ దానికంటే ముఖ్యమైన విషయం కూడా మరొకటి ఉంది. సరిగ్గా 91 ఏండ్ల క్రితం.. ఇదే జూన్ 25న భారత క్రికెట్ జట్టు తమ తొలి అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం వేదికగా భారత జట్టు.. ఇంగ్లాండ్ వేదికగా.. ఆతిథ్య జట్టు ప్రత్యర్థిగా తొలి టెస్టు ఆడింది. యాధృశ్చికమో ఏమో గానీ 1983న ఇదే తారీఖున.. అచ్చంగా ఇదే వేదికలో భారత జట్టు తొలి వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచింది. 

1932లో జూన్ 25న భారత్ - ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టుకు కల్నల్ కటారి కనకయ్య నాయుడు (సీకే నాయుడు.. ఈయన తెలుగువాడే కావడం గమనార్హం) సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లీష్ జట్టుతో తలపడింది. 

ఈ మ్యాచ్ లో ఫలితం భారత్ కు అనుకూలంగా రాకపోయినా చరిత్ర పుటల్లో మాత్రం జూన్ 25 ప్రత్యేకంగా నిలిచిపోయింది. 91 ఏండ్ల భారత క్రికెట్ ప్రయాణానికి తొలి అడుగు పడింది ఇక్కడే.

తొలి ఫైఫర్ అతడిదే.. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింద. కెప్టెన్ డగ్లస్ జార్డైన్.. 79 పరుగులతో టాప్ స్కోరర్. భారత బౌలర్ మహ్మద్ నిస్సార్ 26 ఓవర్లు వేసి 93 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. భారత జట్టు తరఫున తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు తీసిన ఘనత) వీరుడు అతడే కావడం గమనార్హం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్.. 189 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టన్ సీకే నాయుడు (40) టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 8 వికెట్లు కోల్పోయి 275 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో జహంగీర్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 346 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 187 పరుగులకే కుప్పకూలింది. సయీద్ వజీర్ అలీ .. 39 పరుగులతో టాప్ స్కోరర్. ఫలితంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 158 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

Scroll to load tweet…

వన్డే వరల్డ్ కప్ కూడా ఇదేరోజు.. 

1983లో కపిల్ డెవిల్స్ భారత్ కు తొలి వన్డే వరల్డ్ కప్ ను అందించింది కూడా ఇదే రోజు. వరుసగా రెండు వరల్డ్ కప్ లు గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి వచ్చిన వెస్టిండీస్ ను ఫైనల్లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ఖంగుతినిపించింది. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో రాణించింది. భారత్ 183 పరుగులకే ఆలౌట్ కాగా తర్వాత విండీస్.. 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. మదన్ లాల్, మోహిందర్ అమర్‌నాథ్ లు తలా మూడు వికెట్లు పడగొట్టి భారత్ కు తొలి వన్డే వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు.