పోలీసులు ప్రజలతో ఎంత కఠినంగా వుంటారో అందరికీ తెెలిసిందే. అయితే అవసరమయితే ప్రజలను రక్షించడానికి ఎంత వేగంగా స్పందిస్తారో నిరూపించారు పెద్దపల్లి పోలీసులు. 

కరీంనగర్: తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా వున్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా ఈ జిల్లాలోనే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఇలా ఎవ్వరినీ అడుగు బయటపెట్టనివ్వకుండా చూస్తున్న పోలీసులు తాము కఠినంగానే కాదు అవసరమయితే ప్రజలతో కుటుంబసభ్యుల్లా కలిసిపోతామని నిరూపించుకున్నారు. ఇలా ఓ గర్భిణిని హాస్పిటల్ కు ఏకంగా పోలీస్ జీపులోనే తరలించి ఆదర్శంగా నిలిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. గోకుల్ నగర్ కాలనీకి చెందిన కొమ్ము లత అనే గర్బణి (8 నెలలు) కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నా హాస్పిటల్ కు తరలించడానికి లాక్ డౌన్ ఆటంకిగా మారింది. పోలీసులు ప్రైవేట్ వెహికిల్స్ కి అనుమతించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త కుమార్ స్థానిక ఎస్సై శ్యామ్ పటేల్ కు సమాచారం అందించారు. 

ఎలాగైనా తమకు వాహనం సమకూర్చాలని కోరడంతో చలించిపోయిన ఎస్సై వెంటనే తన వాహనాన్ని వారికి సాయం చేయడానికి పంపించారు. పోలీసు జీపులోనే ఓ ఈ నిరుపేద కుటుంబానికి చెందిన గర్భిణిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

అత్యవసర సమయంలో పోలీసులను సంప్రదించండి.. అండగా ఉంటామంటూ చెప్పడమే కాదు ఆచరణలో అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు కమాన్ పూర్ పోలీసులు నిరూపించుకున్నారు. అత్యవసర సమయంలో అండగా నిలిచిన ఎస్సైతో పాటు పొలీస్ డిపార్ట్మెంట్ కు సదరు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.