Asianet News TeluguAsianet News Telugu

Blackmail: ప్రాణం తీసిన మిస్డ్ కాల్.. వివాహిత ఆత్మహత్య.. ఎందుకంటే?

వరంగల్‌కు చెందిన ఓ మహిళకు మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకుందామని ఆమె ఆ నెంబర్‌కు కాల్ చేసింది. తిరుపతి అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చి మాట కలిపాడు. పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. వీడియో కాల్స్ కూడా చేసి చనువుగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ డేటా తస్కరించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. 
 

married woman suicides after calling a missed call number which turned in nightmare kms
Author
First Published Jun 30, 2023, 12:48 PM IST

హైదరాబాద్: ఓ మిస్డ్ కాల్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్‌కు చెందిన వివాహిత ఇంటిలో సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇటు భర్త కుటుంబం, అటు తల్లిదండ్రుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన వరంగల్‌లోని కరీమాబాద్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఆకుతోట సౌజన్య ఓ ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్నది. ఆమెకు ఓ కొన్ని నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ మిస్డ్ కాల్ ఎవరా? అని ఆమె రివర్స్ కాల్ చేసింది. అటు వైపున తిరుపతి అనే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ ఫోన్‌లో సంభాషణలు వారిని మరింత చనువుగా చేశాయి.

తిరుపతి తియ్యగా మాట్లాడుతూనే.. మనసులో కపటంతో ఉన్నాడు. ఆ మహిళను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఆయన ప్లాన్‌లో భాగంగానే.. సౌజన్యతో ఫోన్‌లో క్లోజ్ అయ్యాక వీడియో కాల్ చేయడం ప్రారంభించాడు. వీడియో కాల్ చేసిన తర్వాత ఓ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సౌజన్య ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించాడు. ఆమె ఫోన్ కాంటాక్టులను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఆమెపై వేధింపులు ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. లేదంటే.. ఆమెతో చనువుగా మాట్లాడిన వీడియోలను రికార్డ్ చేశానని, వాటిని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు.

Also Read: పెళ్లి చేసుకున్న రోజే వధువుకు కడుపు నొప్పి.. మరుసటి రోజే ప్రసవం.. షాక్‌లో వరుడు.. ఎలా కవర్ చేశారంటే?

ఈ విషయం చివరకు ఆమె భర్తకు తెలిసింది. దీంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. ఇంటి వద్ద నీటి సంపులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి సౌజన్య మరణించింది.

ఈ ఘటన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. అనంతరం, ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios