Asianet News TeluguAsianet News Telugu

పడిపోయిన వాహనాల విక్రయాలు.. డీలర్ల ఫ్రాఫిట్స్ గోవిందా.. అయితే?!

వాహన విక్రయాలు వరుసగా రెండో ఏడాదీ పడిపోయాయి. దీంతో డీలర్ల లాభదాయకత ఈ ఏడాది మరింత తగ్గిపోతుందని క్రిసిల్​ పేర్కొంది. మొత్తం దేశంలోని 2051మంది డీలర్ల స్థితిగతులపై రూపొందించిన నివేదికలో క్రిసిల్​ ఈ సంగతి తెలిపింది. అయితే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి సొంత వాహనాలవైపే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో అమ్మకాలు పెరుగుతాయని క్రిసిల్ అంచనా వేసింది​.
 

Weak vehicle sales may take toll on automotive dealers in FY21: Crisil
Author
Hyderabad, First Published Jul 9, 2020, 1:51 PM IST

న్యూఢిల్లీ: వరుసగా రెండేళ్ల పాటు వాహన విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణిస్తున్నాయి. అసలే తక్కువగా ఉండే డీలర్ల లాభదాయకత ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గిపోతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. 

తమ వద్ద రేటింగ్‌ పొందిన 2051 మంది డీలర్ల స్థితిపై నివేదికను అందజేసింది. 2019-20లో వాహన అమ్మకాల్లో 18 శాతం క్షీణత నమోదైంది. 

కొవిడ్‌-19 వల్ల జూన్‌ త్రైమాసికంలో మరింత కుదేలు కానున్నది. వ్యాపారాలు బాగా తక్కువగా జరుగుతుండటం, రాకపోకలపై ఆంక్షలు, విచక్షణకనుగుణంగా ఖర్చు పెట్టే శక్తిని ప్రజలు కోల్పోవడం వల్ల వాహన అమ్మకాలు క్షీణిస్తున్నాయని క్రిసిల్ వివరించింది. 

ఫలితంగా కొత్తగా మరింతమంది వాహన డీలర్లను నియమించుకోవాలన్న కంపెనీల లక్ష్యాలకు అవరోధం ఏర్పడుతోందని పేర్కొంది. సొంతంగా షోరూంలను కలిగి ఉన్న డీలర్లు, విడిభాగాల అమ్మకం, బీమా వంటి అనుబంధ సేవలను కలిగిన వారు ఈ నష్టాలను తట్టుకునే వీలుంది. 

డీలర్ల మొత్తం ఆదాయంలో ఈ సేవలపై 10-12 శాతం ఆదాయం లభించడమే ఇందుకు కారణం అని క్రిసిల్ తెలిపింది. ద్విచక్ర వాహన డీలర్ల కంటే వాణిజ్య వాహన డీలర్లపై ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 

also read అది అంత ఈజీ కాదు.. : ఆర్‌సీ భార్గవ ...

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కల్పించిన మారటోరియం, ప్రోత్సాహకాలు ముందస్తుగా అందించడం, వడ్డీవ్యయాల్లో కొంత భరించడంలో వాహన తయారీ సంస్థల సహకారం వల్ల డీలర్లకు ద్రవ్యలభ్యత పెరుగుతుందని క్రిసిల్ నివేదిక పేర్కొన్నది. కొవిడ్‌-19 వ్యాప్తి నుంచి బయట పడేందుకు సొంత వాహనాల వైపు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో అమ్మకాలు పెరుగుతాయనే అంచనాను క్రిసిల్‌ వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే, పెట్రోల్‌, డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం అతి తక్కువగా ఉండటంతో, పెట్రోల్‌, సీఎన్‌జీతో నడిచే ప్రయాణికుల వాహనాలపై భవిష్యత్‌లో కస్టమర్లు మొగ్గుచూపుతారని మరో రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.

ప్రయాణికుల వాహనాల్లో డీజిల్‌ విభాగ వాటా 2012-13లో 58 శాతం, 2019-20లో 29 శాతం కాగా, 2021-22లో 15-18 శాతానికి పరిమితం కావచ్చునని క్రిసిల్ వెల్లడించింది. ఇది కార్లలో 11 నుంచి 5-7 శాతానికి, వినియోగ వాహనాల్లో 65 నుంచి 40 శాతానికి దిగిరావచ్చు.

రూ.5 లక్షల లోపు వాహనాల కొనుగోలుదార్లు పూర్తిగా పెట్రోల్‌, సీఎన్‌జీకే మొగ్గు చూపవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది. బీఎస్‌6 ప్రమాణాల వల్ల వాహనాల ధరలు కూడా రూ.50-70 వేల వరకు పెరగడమూ ఇందుకు దోహద పడనున్నదని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios