జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం రెండో రోజైన బుధవారం కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్(తనఖా) షేర్లు విక్రయంపై మంగళవారం నుంచి పుకార్లు రేగడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు.
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ల భారీ పతనం రెండో రోజైన బుధవారం కూడా కొనసాగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఆర్థిక నివేదికల ఆడిట్, ప్లెడ్జ్డ్(తనఖా) షేర్లు విక్రయంపై మంగళవారం నుంచి పుకార్లు రేగడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు.
ఈ క్రమంలో బుధవారం జీ కౌంటర్ ఏకంగా 12శాతానికి పైగా పతనమైంది. మరో వైపు ఈ పుకార్లను కొట్టిపారేసిన సంస్థ.. జీ ఎంటర్టైన్మెంట్లో ఫ్లెడ్జ్డ్ షేర్ల విక్రయం చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే వాటా విక్రయం అంశం తుది దశకు చేరుకుందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
మరో 6-8వారాల్లో ఈ విక్రయాన్ని పూర్తి చేస్తామని జీ సంస్థ తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయలేమని, రుణాలను తీర్చడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ సీఈఓ పునీత్ గోయంకా స్పష్టం చేశారు. తమ సంస్థ షేరు విలువ అనూహ్య పతనం, వదంతులపై సెబీకి ఫిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉంటే, రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీని గట్టెక్కించేందుకు జీ ఎంటర్టైన్మెంట్లో 50శాతం వాటాలను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సంస్థ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఏడు నెలల క్రితం ప్రకటించారు. ఇక అప్పట్నుంచి జీ ఎంటర్టైన్మెంట్ షేరు విలువ తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. తాజాగా 12శాతం పతనం కావడంతో సంస్థ వివరణ ఇచ్చుకుంది.
