ఏటీఎం విత్ డ్రా రోజుకోసారే?: కాదంటే ఓటీపీ వస్తుంది..
ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలను నిరోధించేందుకు ఢిల్లీలోని బ్యాంకర్లు సిద్ధమయ్యారు. రోజుకొకసారి మాత్రమే ఏటీఎం నుంచి నగదు విత్ డ్రాయల్కు అనుమతించనున్నారు. అంతే కాదు రెండోసారి నగదు విత్ డ్రాయల్ చేస్తే ఓటీపీ నమోదు చేయాలని కెనరాబ్యాంకు ప్రతిపాదిస్తోంది.
ముంబై: బ్యాంకు వినియోగదారులకు షాకింగ్ న్యూస్. అక్రమ లావాదేవీలను నిరోధించే పేరిట, ఏటీఏం రోజువారీ లావాదేవీలను నియంత్రించేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా బ్యాంక్, పెరుగుతున్న ఏటీఎం మోసాలను నియంత్రించే దిశగా చర్యలకు దిగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ (ఎస్ఎల్బీసీ) కమిటీలో బ్యాంకర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటీఎం విత్డ్రాయల్కు అనుమతించాలని ప్రతిపాదించింది. ఒక్కో ఏటీఎం లావాదేవీకి కనీసం 6 నుంచి 12గంటల గడువు ఉండేలా కొత్త నిబంధనను చేర్చాలని తన నివేదికలో సూచించింది.
పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరిగినా, తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే యూజర్లకు మరోసారి తిప్పలు తప్పవు. ఆయా బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా ఎస్ఎల్బీసీ సిఫారసు చేసింది.
దీంతోపాటు కమ్యూనికేషన్ ఫీచర్తో ఏటీఎంలకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదించింది. ఉదాహరణకు ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్లోకి వెళ్తే ‘హెల్మెట్ను తొలగించండి’ అనే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది.
అలాగే బ్యాంక్ శాఖలలో కూడా, వినియోగదారులు టెల్లర్కు దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. అంతేకాదు ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతోంటే కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచేలా సెక్యూరిటీ వ్యవస్థని రూపొందించాలని కోరింది.
కాగా 2018-19లో 179 ఏటీఎం మోసాలతో దేశ రాజధాని ఢిల్లీరెండో స్థానంలో ఉంది. 233 మోసాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత ఏడాది 911 ఏటీఎం మోసాలతో పోలిస్తే ఈ ఏడాదిలో 980కి పెరిగాయి.
క్లోనింగ్ ద్వారా కూడా ఏటీఎం మోసాలు నమోదుగా భారీగానే ఉంటోంది. ఈ మోసాలకు పాల్పడుతున్న వారిలో విదేశీయులూ ఎక్కువే. ఇప్పటికే ఎస్బీఐ ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణను రూ.20 వేలకు కుదించి వేసింది. మరోవైపు రూ.10 వేలకు మించి విత్డ్రా చేసే వారికి ఓటీపీని ఎంటర్ చేయాలని కెనరా బ్యాంకు కూడా ప్రకటించింది.