కొత్త బాస్ రాకతో ఎస్ బ్యాంక్ దూకుడే దూకుడు
బ్యాంకింగ్ రంగంలో 28 ఏళ్ల అనుభవం గల రవ్నీత్ సింగ్ గిల్ను ఎస్ బ్యాంక్ సీఈఓగా నియమించడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. వచ్చే మార్చి ఒకటో తేదీ నుంచి ప్రస్తుత సీఈఓ రాణా కపూర్ స్థానంలో రవ్నీత్ సింగ్ గిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ను నియమించడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్నీత్ సింగ్ గిల్ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం
రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపిందని ఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి ఒకటో తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. ఈ నెల 29వ తేదీన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని పేర్కొంది.
28 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం రవ్నీత్ సింగ్ గిల్ సొంతం
2012, ఆగస్టు నుంచి రవ్నీత్ సింగ్ గిల్ డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. ఎస్ బ్యాంక్ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్ను సీఈఓ, ఎండీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్లోనే ఆర్బీఐ ఆదేశించింది. కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్ అభ్యర్థనను తోసిపుచ్చింది.
పేరుకున్న మొండి బకాయిల వల్లే రాణా కపూర్ పొడిగింపునకు ఆర్బీఐ
రాణా కపూర్ పదవీ కాలం పొడిగింపు నిరాకరించడానికి గల కారణాలను ఆర్బీఐ వెల్లడించకున్నా, కపూర్ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది.
రూ.49,460 కోట్లకు ఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ పెరుగుదల
ఎస్ బ్యాంక్ సీఈఓగా రవ్నీత్ సింగ్ గిల్ నియామాకానికి ఆర్బీఐ ఆమోదం ఆమోదం తెలుపడంతో బ్యాంకు భవితవ్యంపై అనిశ్చితి తొలగిపోవడంతో షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో 8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో ఈ షేర్ 19% ఎగసి రూ.235ను తాకింది. షేర్ జోరు కారణంగా ఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరుగుదల
నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధితో రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత మూడో త్రైమాసికంలో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ గత డిసెంబర్ నెలతో ముగిసి త్రైమాసికంలో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు.
ఏడు శాతం తగ్గిన నికర లాభం
ఎస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఏడు శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.1,002 కోట్లకు తగ్గిందని ఎస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం ఏడు శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్ పేర్కొన్నారు.
తగ్గిన రుణ నాణ్యత
ఎస్ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. 2017- 18 మూడో త్రైమాసికంలో 1.72%గా ఉన్న స్థూల మొండి బకాయిలు గత డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93% నుంచి 1.18%కి చేరాయి. ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్ కంపెనీలకు రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని రాణా కపూర్ పేర్కొన్నారు.