కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్థవ్ థాక్రే స్పందించారు. మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు వున్నారని గుర్తించిందని థాక్రే చురకలంటించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారమైన హృదయంతో చివరి బడ్జెట్ను సమర్పించారని ఆయన వ్యాఖ్యానించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
Union Budget 2024 Live Updates : ఇది చారిత్రాత్మక బడ్జెట్ :ప్రధాని నరేంద్ర మోదీ
)
2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రూ.47.66 లక్షల కోట్ల బడ్జెట్ కు లోక్ సభ ఆమోదం లభించింది.
మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ : ఉద్థవ్ థాక్రే
బడ్జెట్ 2024 : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏమన్నారంటే..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తి, సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'అమృత్ కాల్' శకానికి ఎలా నాంది పలికిందో భారత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఒక అద్భుతమైన సారాంశం అని రాజీవ్ వివరించారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదని .. భారతదేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా మార్చివేసిన నిజమైన పాలనా భావజాలం అని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 2014లో భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఉందని, కానీ నేడు బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో టాప్ 5లో ఉందని ఆయన వెల్లడించారు
ఆత్మ నిర్భర్ భారత్కు ఈ బడ్జెట్తో ఊతం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
అభివృద్ధి చెందిన, 'ఆత్మ-నిర్భర్' భారతదేశాన్ని నిర్మించడానికి ఈ మధ్యంతర బడ్జెట్ వేగాన్ని అందిస్తుందన్నారు బీజేపీ నేత , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 140 మంది ఆశలను నెరవేర్చే బడ్జెట్ను సమర్పించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ మధ్యంతర బడ్జెట్ ముఖ్యమైనదని యోగి అన్నారు.
బడ్జెట్తో ఏపీకి దక్కిందేమీ లేదు : జేడీ లక్ష్మీనారాయణ
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విభజన వల్ల గాయపడిన ఏపీకి ఈ బడ్జెట్ వల్ల ఒనగూరిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా పేదరికంపై స్కీములు పెట్టే స్థితిలోనే వున్నామని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. జన్ ధన్ ఖాతాల్లో 34 లక్షల కోట్లు వేశామని కేంద్రం చెబుతోందని.. అలా వేస్తే అభివృద్ధి జరిగినట్లేనా అని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఏపీలో పోలవరం పరిస్ధితి అగమ్య గోచరంగా వుందని ఆయన దుయ్యబట్టారు.
5 లక్ష్యాలను నిర్దేశించుకున్నాం : నిర్మలా సీతారామన్
వరుసగా మూడేళ్ల నుంచి 7 శాతం అభివృద్ధి రేటు సాధిస్తున్నామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.మధ్యంతర బడ్జెట్ అనంతరం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సరైన నిర్ణయాలు, విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. క్రమంగా ద్రవ్యోల్భణ లోటును తగ్గించుకుంటూ వస్తున్నామని నిర్మల తెలిపారు. ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దిశా నిర్దేశక్ బాతే కింద 5 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని.. జీ20లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ వుందన్నారు. అభివృద్ధి పథంలో సాగుతూ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇది రోజువారీ లెక్కల బడ్జెట్ : మల్లిఖార్జున ఖర్గే
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. తాను బడ్జెట్ను శ్రద్ధగా విన్నానని .. పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం బడ్జెట్లో ఏదీ ప్రస్తావించలేదని ఖర్గే ఎద్దేవా చేశారు. ఇది కేవలం రోజువారీ వ్యవహారాల బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. పదేళ్లుగా ఇచ్చిన వాగ్థానాల వివరాలు , ఎన్ని హామీలు నెరవేర్చారో తులనాత్మక ప్రకటన ఇవ్వాలని ఖర్గే పేర్కొన్నారు.
రూ.6.21 లక్షల కోట్లకు చేరిన డిఫెన్స్ బడ్జెట్ : రక్షణ శాఖ స్పందన ఇదే
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్పై కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వయం విశ్వాసం, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యాలతో 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ రూ.6.21 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన మొత్తం కేంద్ర బడ్జెట్లో ఇది 13.04 శాతమని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ బడ్జెట్ దేశానికే మార్గదర్శకం : నాదెండ్ల మనోహర్
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్న ఆయన.. యువతను, మహిళలను ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు.
మధ్యంతర బడ్జెట్పై అమిత్ షా ప్రశంసలు
2024- 25 మధ్యంతర బడ్జెట్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్కు ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్లా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. గడిచిన పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ సారథ్యంలో సాధించిన మైలురాళ్లను బడ్జెట్ హైలైట్ చేసిందని షా అన్నారు.
విశాఖ రైల్వే జోన్ : ఏపీ సర్కార్ భూమి ఇవ్వలేదన్న అశ్వినీ వైష్ణవ్
మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించలేదన్నారు. తాము 53 ఎకరాల భూమిని అడిగితే .. ఏపీ సర్కార్ నుంచి ఆ భూమి అప్పగింత జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలుపెడతామని, జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 వేల కోట్లు
మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రైల్వే బడ్జెట్ను సైతం కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రూ.886 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గుర్తుచేశారు. ఇది 10 శాతం రెట్టింపు కేటాయింపులని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయ్యిందని రైల్వే మంత్రి తెలిపారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
మధ్యంతర బడ్జెట్పై భారత్లో డబ్ల్యూహెచ్వో ప్రతినిధి ప్రశంసలు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్పై భారత్లో డబ్ల్యూహెచ్వో ప్రతినిథి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్ స్పందించారు. ‘‘ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అట్టడుగు స్థాయిలో ఆరోగ్యం సంరక్షణ విషయంలో ముందంజలో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయుష్మాన్ భారత్ కింద వారికి ఆరోగ్య సంరక్షణను పొడిగించడం అభినందనీయం . మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలు భారత్లో వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ సేవలు బలోపేతం అవుతాయి ’’ అని ఆఫ్రిన్ వ్యాఖ్యానించారు.
స్టార్టప్ ఎకోసిస్టమ్కు బూస్టప్ ఇచ్చేలా బడ్జెట్ : ఫడ్నవీస్
మధ్యంతర బడ్జెట్పై బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో పేద , మధ్యతరగతి ప్రజల కోసం అనేక పథకాలను ప్రకటించారని ప్రశంసించారు. రూ. లక్ష కోట్ల కార్పస్ దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్కు సహాయం చేస్తుందని ఫడ్నవీస్ ఆకాంక్షించారు. నానోడాప్ పథకం రైతులకు మేలు చేస్తుందని, ఇన్ఫ్రాలో రూ. 11 లక్షల కోట్లకు పైగా పథకాలు వినూత్నమైనవని ఆయన ప్రశంసించారు. అభివృద్ధి చెందిన భారత్కు రోడ్మ్యాప్ను ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్లో సమర్పిస్తామని నిర్మలా సీతారామన్ నమ్మకంగా చెప్పారని ఫడ్నవీస్ అన్నారు.
స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని మధ్యంతర బడ్జెట్
మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గానే కొనసాగుతున్నాయి. తాత్కాలిక బడ్జెట్లో చెప్పుకోదగ్గ ప్రకటనలేవీ లేకపోవడంతో మార్కెట్లు స్పందించలేదని అప్డేట్స్ చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12.31 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 71,760 వద్ద.. నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 21,727 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
తాజా బడ్జెట్ తో కేంద్రం ఖాతాలో కొత్త రికార్డ్ : యూపీ మాజీ సీఎం అఖిలేష్
కేంద్ర బడ్జెట్ పై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిజెపి ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిందన్నారు. ఈ రికార్డును ఎవరూ బద్దలేకొట్టలేరు... ఎందుకంటే త్వరలోనే ప్రజాపాలన అందించే ప్రభుత్వం అధికారంలోకి రానుందని అన్నారు.
ఇది చారిత్రాత్మక బడ్జెట్ :ప్రధాని నరేంద్ర మోదీ
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని అన్నారు. యువత కోసమే ఈ బడ్జెట్లో కేటాయింపులు వుందన్నారు. అందరి అవవరాలు తీర్చే భద్రత ఇది అని అన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు వున్నాయన్నారు.
ఇది పేద, మద్య తరగతి వర్గాల బడ్జెట్
పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ తో లభ్ది లభిస్తుంది. సోలార్ రూప్ టాప్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ కల్పిస్తాం... మిగులు విద్యుత్ అమ్మకం ద్వారా 15 నుండి 20 వేల రూపాయల ఆదాయం వస్తుంది.
పథకాలు, కార్యక్రమాల వారిగా నిధుల కేటాయింపు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 86 వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్ - పీఎంజేఏవై 7500 కోట్లు
ఉత్పాదక రంగానికి చెందిన పథకాల కోసం 6,200 కోట్లు
టెక్నాలజీ అభివృద్ది 6,900 కోట్లు
సోలార్ పవర్ 8,500 కోట్లు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 600 కోట్లు
శాఖలవారిగా నిధుల కేటాయింపు
రక్షణ శాఖ 6.2 లక్షల కోట్లు
రవాణ మరియు హైవే 2.78 లక్షల కోట్లు
రైల్వే 2.55 లక్షల కోట్లు
పౌర సరఫరా శాఖ 2.13 లక్షల కోట్లు
హోంశాఖ 2.03 లక్షల కోట్లు
రూరల్ డెవలప్ మెంట్ 1.77 లక్షల కోట్లు
కెమికల్ ఆండ్ పర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ 1.37 లక్షల కోట్లు
వ్యవసాయం మరియ రైతుల సంక్షేమం 1.27 లక్షల కోట్లు
ఓటాన్ అకౌంట్ రూ.47.66 లక్షల కోట్లు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ప్రకటించారు నిర్మలా సీతారామన్. 30 లక్షల కోట్ల ఆదాయంగా పేర్కొన్నారు.