మాల్యాకు మరో షాక్: డియాజియో ‘135 మిలియన్ డాలర్ల క్లెయిమ్’కే ఓకే
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ స్పిరిట్స్ సంస్థల రుణాల ఎగవేత విషయమై లండన్ కోర్టులో భారతదేశానికి అప్పగింత కేసు విచారణను ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వాటాలను ఉపసంహరించుకున్న కేసులో తమకు విజయ్ మాల్యా నుంచి 175 మిలియన్ల డాలర్లను ఇప్పించాలని డియాజియో దాఖలు చేసిన పిటిషన్పై యునైటెడ్ కింగ్ డమ్ హైకోర్టు విచారించింది. 175 మిలియన్ల డాలర్లతోపాటు పరిహారం, న్యాయ ఖర్చుల కింద మరో 2 లక్షల పౌండ్లు చెల్లించాలని విజయ్ మాల్యాను ఆదేశించింది.
లండన్: విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్ పానీయాల సంస్థ డియాజియోకు 135 మిలియన్ డాలర్లు (సుమారు రూ.945 కోట్లు) చెల్లించాలని విజయ్ మాల్యాను యునైటెడ్ కింగ్డమ్ హైకోర్టు జస్టిస్ రాబిన్ నౌలెస్ శుక్రవారం ఆదేశించారు.
విజయ్ మాల్యా నుంచి తమకు 175 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1225 కోట్లు) పరిహారం ఇప్పించాలని డియోజియో కోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో తీర్పు ఇస్తూ 135 మిలియన్ల డాలర్లను వడ్డీతో సహా చెల్లించాలని, న్యాయ ఖర్చుల కింద మరో 2 లక్షల పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)లో వాటా కొనుగోలుకు సంబంధించి మాల్యా, ఆయన కుమారుడు సిద్థార్థ, ఈ కుటుంబంతో అనుబంధం కలిగిన మరో రెండు కంపెనీలు తమకు ఈ మొత్తం చెల్లించాలని డియాజియో వాదిస్తోంది. మూడేళ్ల క్రితం మాల్యా సారథ్యంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)లో కొనుగోలు చేసిన వాటాల ఉపసంహరణకు సంబంధించి నిధులు తమకు చెల్లించాల్సి ఉన్నదని డియాజియో పేర్కొంది.
ఇందులో మొత్తం 40 మిలియన్ల డాలర్లు నేరుగా విజయ్ మాల్యా, మిగతా సొమ్ము సిద్ధార్థ మాల్య అండ్ వాట్సన్ లిమిటెడ్ సంస్థలు చెల్లించాల్సి ఉన్నదని డియాజియో పేర్కొంది. డియా జియో ఇంటర్నేషనల్ డిస్టిలర్ బ్రాండ్స్ జానీ వాకర్, స్మిర్నోఫ్ వంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది.
ఈ కేసులో డియాజియో పీఎల్సీ, డియాజియో హోల్డింగ్స్ నెదర్లాండ్స్ బీవీ (డీహెచ్ఎన్), డియాజియో ఫైనాన్స్ సంస్థలు 2016లో విజయ్ మాల్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆర్థిక ఒప్పందం మేరకు విజయ్ మాల్యా.. యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్గా వైదొలగాల్సి ఉంది.
వాట్సన్ అండ్ సీఏఎస్ఎల్ అనే విజయ్ మాల్య సంస్థలకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం విషయంలో ఇబ్బందులు తలెత్తితే.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి డియాజియో రీ ఫైనాన్స్ చేయించింది. అయితే రుణాల ఎగవేత కేసులో యూఎస్ఎల్ షేర్లను భారత్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) జప్తు చేసింది.
తాము కోర్టు ముందుకు రావడానికి పలు దఫాలుగా చర్చలు జరిగాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణకే తాము కట్టుబడి ఉన్నామని డియాజియో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే డియాజియో పిటిషన్పై విజయ్ మాల్యా వాదనను కోర్టు తిరస్కరించింది. మరోవైపు రూ.9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యను భారత్ కు అప్పగించే అంశంపై దాఖలైన పిటిషన్ శుక్రవారం లండన్ హైకోర్టులో విచారణకు రానున్నది.