టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలోనే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో ఇప్పటికే వాటాలు ఉన్న ఆయన.. మైక్రో బ్లాగింగ్ సైట్‌ను పూర్తిగా సొంతం చేసుకోవడం కోసం 44 బిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించగా.. అందుకు ట్విట్టర్ ఓకే చెప్పింది. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించే అవకాశం లేకపోలేదు.  

బిలియనీర్ ఎలాన్ మస్క్.. టెస్లా బాస్ కాస్తా.. ఇప్పుడు ట్విట్టర్ బాస్ అయిపోయారు. మస్క్ అనుకున్నది సాధించాడు. ఎట్టకేలకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. అదే.. ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కొనసాగుతాడా లేదా? ఎందుకంటే.. ట్విట్టర్ మేనేజ్‌మెంట్‌కు తాను వ్యతిరేకమని గతంలోనే ఎలాన్ మస్క్ చెప్పేశాడు. రాబోయే రోజుల్లో మేనేజ్‌మెంట్‌లో గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉందన్నాడు. 

మరి డీల్ పూర్తియ్యాక కూడా ట్విట్టర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను మస్క్ కొనసాగిస్తారా? లేదా అనేది చూడాలి. ఒకవేళ మస్క్.. పరాగ్ అగర్వాల్‌ను తొలగించాలని నిర్ణయించుకుంటే మాత్రం.. బిలియనీర్ అతనికి దాదాపు 42 మిలియన్ల డాలర్లు చెల్లించవలసి వస్తుంది. రీసెర్చ్ సంస్థ ఈక్విలర్ ప్రకారం.. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో నియంత్రణలో మార్పు వచ్చిన 12 నెలల్లోపు అగర్వాల్‌ను తొలగించిన పక్షంలో మస్క్ సుమారు 42 మిలియన్ డాలర్లు అగర్వాల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు.

ఏప్రిల్ 14న సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో మస్క్ ట్విట్టర్ నిర్వహణపై తనకు నమ్మకం లేదని చెప్పేశాడు. మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో అగర్వాల్ భవిష్యత్తులో ట్విటర్ సీఈఓగా కొనసాగుతారా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఆయనే సీఈఓగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరాగ్‌ అగర్వాల్ కూడా ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ ఏ దిశలో వెళ్తుందో అనిశ్చితంగా ఉందని ట్వీట్ చేశాడు. 

గతంలో సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేసిన వెంటనే అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు. పరాగ్ గతేడాది నవంబర్ నుంచి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే కంపెనీలో పరాగ్ CTOగా పనిచేశాడు. Twitter ప్రాక్సీ ప్రకారం.. ఎక్కువగా స్టాక్ అవార్డులలో 2021కి పరాగ్ అగర్వాల్ మొత్తం పరిహారం దాదాపు 30.4 మిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ ట్విట్టర్ ఒప్పందానికి డోర్సే మద్దతుగా నిలిచారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం ప్లాట్‌ఫారమ్‌కు సరైన దిశలో ఒక అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని 10 రోజుల క్రితం ప్రకటించిన మస్క్‌.. చివరికి సొంతం చేసుకున్నారు. మస్క్‌ ఇచ్చిన భారీ ఆఫర్‌కు ట్విట్టర్‌ బోర్డ్‌ సైతం ఆమోదం తెలిపింది. ఒక్కో షేరుకు 54 రూపాయల 20పైసల ధరతో వాటాలపై డీల్‌ సెట్ చేసుకున్నాడు మస్క్. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్ చేజిక్కించుకున్నాడు. 16 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ట్విట్టర్ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లో 15వ స్థానంలో ఉంది. గతంలోనే ఈ ట్విట్టర్ ను ఎలాగైన సొంతం చేసుకోవాలని మస్క్ మైండ్ గేమ్ ఆడిన విష‌యం తెలిసిందే.