నేడే రిలయన్స్ ఏజీఎం, 5జీ ఫోన్ సహా పలు సర్వీసులపై కీలక ప్రకటన చేసేచాన్స్..
నేడు రిలయన్స్ ఏజీఎం భేటీ కానుంది. దీంతో కంపెనీ చేసే కీలక ప్రకటనలు, నిర్ణయాలపై మార్కెట్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ప్రస్తుతం సవాళ్లను ఉద్దేశిస్తూ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏమేం ప్రకటనలు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (RIL AGM) జరగనుంది. ఈ సమావేశంపై మార్కెట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇందులో 5జీ సర్వీసు గురించి కీలక ప్రకటన చేసే వీలుంది. 5G సర్వీసుతో పాటు, ఇంకా చాలా విషయాలు కూడా ఇందులో పేర్కొనే అవకాశం ఉంది.
ఇటీవలే కంపెనీ 5జీ స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నాటికి ప్రధాన సర్కిళ్లలో 5జీ సేవలను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 5G సర్వీసు రోల్ అవుట్ నుండి టారిఫ్ ప్లాన్ల వరకు సమాచారాన్ని ఈ నివేదికలో ఇవ్వవచ్చని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ సమావేశంలో 5G సర్వీసు ఫీచర్స్ చూపించవచ్చని అంతా భావిస్తున్నారు.
ఇంతకు ముందు కూడా వార్షిక సమావేశంలో కంపెనీ టెలికాం ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లు తదితరులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ ప్రసంగించనున్నారు.
ఈ ఈవెంట్ ను ఆన్లైన్లో చూడవచ్చు.. రిలయన్స్ ఏజీఎం భేటీని Facebook, JioMeet, Real-time Messaging Protocol (RTMP), Twitter, YouTube, Instagram, Kuలో ప్రసారం చేసే వీలుంది. మునుపటి నివేదిక ప్రకారం, కంపెనీ తన చౌకైన 5G ఫోన్ను కూడా ఈ సమావేశంలోనే ప్రవేశ పెట్టే వీలుంది. ఈ ఫోన్కు సంబంధించిన అనేక కీలక ఫీచర్లు నివేదికలో పేర్కొన్నారు. దీని ధర విషయానికొస్తే, దీని ధర 9 వేల రూపాయల నుండి 12 వేల రూపాయల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇది కాకుండా, 5G సర్వీసు ప్రారంభ తేదీని కంపెనీ ఈ ఏజీఎం భేటీలో తెలియజేయవచ్చు. ఈ సమావేశంలో, కంపెనీ 5G ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 5G స్పెక్ట్రమ్ను కొనుగోలు చేయడానికి కంపెనీ సుమారు 88 వేల కోట్లు ఖర్చు చేసింది.
అలాగే 5జీతో పాటుగా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ, జియో ఐపీవో, రిలయన్స్ గిగా ఫ్యాక్టరీ, జియో ట్యాగ్, రిలయన్స్ రిటైల్ గురించి సైతం ఈ ఏజీఎంలో మీడియా ముఖంగా వెల్లడి చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే ఏజీఎం భేటీ సందర్బంగా రిలయన్స్ షేర్లు మార్కెట్లో ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఏజీఎం భేటీ అనంతరం రిలయన్స్ షేర్లు రాలీ చేయడం సహజంగానే చూస్తున్నాం. దీంతో ఈ సారి కూడా ఏజీఎం అనంతరం రియలన్స్ షేర్లలో ర్యాలీ వస్తుందని అంతా భావిస్తున్నారు.