Asianet News TeluguAsianet News Telugu

డాలర్ బలానికి రూపాయి విలువ కనిష్ట స్థాయికి పతనం..డాలర్ బలపడితే ఏం జరుగుతుంది..ఆర్బీఐ వ్యూహం ఏంటి..

అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కొనసాగుతోంది. సోమవారం, 26 సెప్టెంబర్, ఒక డాలర్ ధర 81 రూపాయల 58 పైసలకు చేరుకుంది. క్రితం ముగింపు 80.99తో పోలిస్తే ఈరోజు రూపాయి 81.55 వద్ద ప్రారంభమైంది. ఇది శుక్రవారం ముగింపు ధర కంటే 56 పైసలు బలహీనంగా ఉంది.

The value of the rupee falls to the lowest level due to the impact of the dollar What is the RBI strategy
Author
First Published Sep 26, 2022, 3:57 PM IST

గడిచిన 3 ట్రేడింగ్ సెషన్లలో డాలర్‌తో రూపాయి 1 రూపాయి 70 పైసలు బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ 20 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయి పతనం కారణంగా దేశీయంగా దిగుమతి చేసుకునే క్రూడాయిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్క్ డ్రగ్స్ ధరలు పెరుగతాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం, ద్రవ్యోల్బణం రేటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో, రూపాయి పతనాన్ని ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం డాలర్లను విక్రయించడంపై కూడా చర్చ జరుగుతోంది. గత ట్రేడింగ్ వారంలో, భారత రూపాయి మొదటిసారిగా 81 స్థాయిని దాటింది. సరికొత్త రికార్డు కనిష్టాన్ని (81.24) తాకింది. సెప్టెంబర్ 23న డాలర్‌కు 125 పైసలు తగ్గి 80.99 వద్ద, సెప్టెంబర్ 16న 79.74 వద్ద ముగిసింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయం
క్రూడాయిల్ ఇతర కమోడిటీస్ దిగుమతులు రూపాయి రికార్డు స్థాయికి తగ్గడం వల్ల ఖరీదైనవిగా మారనున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారతదేశం తన చమురులో 85 శాతం , గ్యాస్‌లో 50 శాతం దిగుమతి చేసుకుంటుంది. రూపాయి క్షీణత దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపవచ్చు. భారతీయ ఆహార నూనెల అవసరాలు కూడా దిగుమతుల ద్వారానే తీరుతాయి. రూపాయి పతనం వల్ల దిగుమతి చేసుకునే ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరుగుతాయని మిల్లర్ల సంఘం, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా చెప్పారు. అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కమోడిటీ ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై అనుకూల ప్రభావం రూపాయి పతనం కారణంగా కొంత ప్రభావం చూపుతుందని ఇక్రా రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అంటున్నారు.

ఆగస్టులో భారత వాణిజ్య లోటు 27.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది
ఆగస్టు 2022లో కూరగాయల నూనె దిగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 41.55 శాతం పెరిగి 1.89 బిలియన్ లకు చేరాయి. పెరిగిన ముడి చమురు దిగుమతుల కారణంగా ఆగస్టులో భారతదేశ వాణిజ్య లోటు రెండింతలు పెరిగి 27.98 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పెట్రోలియం, ముడి చమురు, ఉత్పత్తుల దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 87.44 శాతం పెరిగి ఈ ఏడాది ఆగస్టులో 17.7 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఆర్బీఐ వ్యూహం ఇదే...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పరిమిత కాలానికి రూపాయి పతనానికి కూడా ఆర్‌బీఐ అనుమతినిస్తుందని నివేదిక పేర్కొంది. రూపాయి విలువలో ఈ పతనం డాలర్ బలం కారణంగా వచ్చిందని, దేశీయ ఆర్థిక విధానాల వల్ల కాదని పేర్కొంది.

ఆర్‌బీఐ డాలర్లను విక్రయించింది
రూపాయి పతనాన్ని ఆపడానికి, రిజర్వ్ బ్యాంక్ చివరి సెషన్‌లో అంటే శుక్రవారం డాలర్లను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించినట్లు విశ్వసనీయ వర్గాలు రాయిటర్స్‌తో చెప్పారు. రికార్డు స్థాయిలో రూపాయి పతనం తర్వాత ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. రూ. 81.20 స్థాయి వద్ద ఆర్‌బీఐ జోక్యం చాలా దూకుడుగా ఉందని ఓ ప్రైవేట్ రంగ బ్యాంకు ప్రతినిధి తెలిపారు. 2 ప్రభుత్వ రంగ బ్యాంకు వ్యాపారులు కూడా RBI డాలర్లను విక్రయించినట్లు ధృవీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios