మలయాళీలకు టెల్కోల ఆఫర్ల ‘ఆపన్నహస్తం’
కేరళలో కురుస్తున్న తీవ్ర వర్షాలతో అక్కడి ప్రజా జీవనం స్తంభించిపోయింది. దాదాపు 14 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న తీవ్ర వర్షాలతో అక్కడి ప్రజా జీవనం స్తంభించిపోయింది. దాదాపు 14 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇతర రాష్ట్రాలు, సినీ ప్రముఖులు కూడా మలయాళీలనుసాధ్యమైనంత ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే టెలికాం సంస్థలు తగిన సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఫోన్ బిల్లుల చెల్లింపుల్లో వెసులుబాటు, అలాగే ఒక వారం రోజుల పాటు ఫ్రీ డేటా, టాక్ టైం అందిస్తామని ప్రకటించాయి.
ఏడు రోజుల ‘జియో’ ఉచిత సేవలిలా.
.
రిలయన్స్ జియో ఏడు రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తానని ప్రకటించడంతోపాటు, బీఎస్ఎన్ఎల్ అపరిమిత ఫ్రీ కాల్స్, డేటా, 100 మేసేజ్లు అందించనున్నది. అలాగే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.30 టాక్ టైం క్రెడిట్, 1జీబీ డేటాను వారం రోజులు పాటు అందించడానికి ముందుకు వచ్చింది. ‘ఈ బాధాకర సమయాల్లో మీకు సాయం చేయడానికి మీ వెంట ఉంటాం. మీరు ఆప్తుల గురించి సమాచారం తెలుసుకోవడానికి, వారితో టచ్లో ఉండటానికి ఈ ఆఫర్ ను అందిస్తున్నాం’ అని జియో తెలిపింది.
వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత ఆపర్లు
బీఎస్ఎన్ఎల్ సొంత వినియోగదారులు అపరిమితంగా ఆఫర్లు అందించడంతోపాటు ఇతర నెట్ వర్క్ల వారితో మాట్లాడేందుకు రోజుకు 20 నిమిషాల టాక్టైంను అందిచనున్నదని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో చేరింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు బిల్లు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వడంతోపాటు ఎటువంటి అంతరాయం లేని సేవలను కల్పించనున్నది. అలాగే ఒక వీశాట్ను ఏర్పాటు చేసి ఐదు కేంద్రాల్లో ఫ్రీ వైఫై, కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొన్నది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో దగ్గరిలో గల ఎయిర్ టెల్ షోరూంలలో ఛార్జింగ్ చేసుకోవడం, స్టోర్స్ నుంచి ఫ్రీ కాల్స్ చేసుకొనే ఫెసిలిటీని ఎయిర్ టెల్ అందిస్తుంది.
రూ.10 లక్షల కోట్లకు ఐటీ వసూళ్లు
గత ఆర్థిక సంవత్సరం (2017 - 18)లో రూ.10.03 లక్షల కోట్ల మేర ఆదాయం పన్ను వసూలైనట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఆదాయ పన్ను తూర్పు జోన్ రెండు రోజుల సమావేశంలో సీబీడీటీ సభ్యుడు శబ్రి భట్టసాలి మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.92 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని, అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1.31 కోట్ల మంది పెరిగారని చెప్పారు. 2016-17లో 5.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. నికరంగా గతేడాది కోటి మందికిపైగా పన్ను పరిధిలోకి వచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1.25 కోట్ల మందిని ఈ పన్ను పరిధిలోకి తేవాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్ద అప్పు ఖాతాలపై ఆర్బీఐ నజర్!
దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రక్షాళన దిశగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అడుగులు వేస్తోంది. దేశంలోని అతిపెద్ద మొండిబాకీలు వాటికి బ్యాంకులు ప్రత్యేకంగా జరుపుతున్న కేటాయింపులపై ప్రత్యేక నజర్ పెట్టింది. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిలో కొనసాగుతున్న దాదాపు 200 పెద్ద అప్పు ఖాతాలు.. వాటికి ఆయా బ్యాంకులు జరిపిన కేటాయింపులపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ మొండి బాకీల విషయంలో బ్యాంకులు నిర్ధిష్టమైన నిబంధనలు పాటించాయా లేదా అనే దానిపై తొలుత సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా రుణాలపై అంచనా, కేటాయింపులు, రుణాల పునరుద్ధ్దరణపై ఆర్బీఐ దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
వీడియోకాన్, జిందాల్ తదితర సంస్థలపై ఆర్బీఐ ‘ఐ’
ఆర్బీఐ పరిశీలనలో ఉన్న సమస్యాత్మక పెద్ద ఖాతాల్లో వీడియోకాన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ తదితర సంస్థలు ఉన్నట్టుగా సమాచారం. 2018 మార్చి ముగింపుకల్లా బ్యాంకింగ్ రంగంలో స్థూల మొండి బాకీలు రూ.10.3 లక్షల కోట్లకు చేరి, 11.2 శాతంగా నమోదయ్యాయి. 2017 ఇదే మార్చి నాటికి మొండి బాకీలు రూ.8 లక్షలతో 9.5 శాతంగా చోటు చేసుకున్నాయి. గతేడాది జరిపిన వార్షిక తనిఖీల్లో యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, యస్ బ్యాంకులు మొండి బాకీలను తక్కువగా చూపి దొరికి పోయాయి. ఆ బ్యాంకులు మొండి బాకీల కోసం కేటాయింపులు తక్కువగా చేసి చూపెట్టాయి. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు తమకు మొండి బాకీల సమగ్ర వివరాలను అందజేయాలని గతేడాది ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.