ఆక్విజన్స్ ‘హంగ్రీ’లో టీసీఎస్.. బట్
టెక్నాలజీ, ఐటీ రంగాల్లో సంస్థల స్వాధీనం పట్ల ‘హంగ్రీ’తో ఉన్నామని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. స్టార్టప్ సంస్థల్లో అందుకు అవకాశం ఉన్నదని తెలిపారు.
భారత్లోని అతిపెద్ద ఐటీసర్వీసుల సంస్థ టీసీఎస్ కొత్త సంస్థల కొనుగోళ్ల విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. కొత్త మేధో సంపత్తి ద్వారా మార్కెట్ను విస్తరించాలని భావిస్తోందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలిపారు.
ఇటీవల లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిజిటల్ డిజైన్డ్ స్టూడియో డబ్ల్యూ12 స్టూడియోస్, బ్రిడ్జిపాయింట్ గ్రూప్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
‘మేం కొనుగోళ్లకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. మాకు కొనుగోళ్లు.. ఆ కంపెనీలను విలీనం చేసుకోవడంలో మంచి రికార్డు ఉంది. మా సంస్థకు సరైన మేధో సంపత్తి తీసుకురాగల సంస్థకోసం మేము మార్కెట్లో అన్వేషణ కొనసాగిస్తాం.
స్టార్టప్లు చాలా బాగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్చెయిన్ విభాగాంలో చాలా కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. ఫైనాన్షియల్ విభాగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి’అని తెలిపారు.
స్టార్టప్ సంస్థల్లో కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. ప్రత్యేకించి బ్లాక్ చెయిన్ విభాగంలో స్టార్టప్ సంస్థలు చాలా బాగా క్రుషి చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్లో ఫైనాన్సియల్ సర్వీసెస్ అందించనున్న స్టార్టప్ సంస్థల టేకోవర్ పై కేంద్రీకరించామన్నారు.
ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మొత్తం విలీనాల బాట పట్టాయి. టీసీఎస్ ఫ్రెంచ్ ‘శాప్’ సేవలను అందించే ఆల్టీ ఎస్ఏను 75 మిలియన్ యూరో డాలర్ల (రూ.544 కోట్లు)కు 2013లో కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ గత ఏడాది వాంగ్డూడీని 75 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
అయితే టీసీఎస్ తొందరపాటుతో ముందుకు వెళ్లబోదని గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ఇదిలా ఉంటే విప్రో డిజిటల్ విభాగం ‘డిసిగ్నేట్ అండ్ కూపర్’లో పెట్టుబడి పెట్టింది. తాజాగా మైంట్ ట్రీ సంస్థను ఇన్ ఫ్రా మేజర్ ‘ఎల్ అండ్ టీ’ టేకోవర్ చేసుకునే పనిలో పడింది.