స్విగ్గీ గో సేవలు :2 వారాల్లో భాగ్యనగరిలో షురూ!!
ఆన్లైన్ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ వ్యాపార సేవల విస్తృతిని విస్తరించింది. పికప్ అండ్ డ్రాప్ సేవలను అందిజేస్తామనిస్విగ్గీ తెలిపింది.
బెంగళూరు: ఆన్లైన్ ఆహార సేవల సంస్థ స్విగ్గీ తమ వ్యాపార సేవల విస్తృతిని విస్తరించింది. ‘స్విగ్గీ గో’ పేరుతో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. స్విగ్గీగో విభాగం ద్వారా పికప్ అండ్ డ్రాప్ సేవలను అందిజేస్తామనిస్విగ్గీ తెలిపింది.
స్విగ్గీ గోలో భాగంగా ఇంట్లో లంచ్ బాక్స్ను ఆఫీసుల వద్ద అందజేయడం, పత్రాలు, పార్శిల్స్ డెలివరీ చేయడం వంటి సేవలను అందించనున్నది. మరో రెండు వారాల్లో హైదరాబాద్ నగర పరిధిలో ‘స్విగ్గీ గో’ సేవలను ప్రారంభించనున్నది.
నిత్యావసర వస్తువులు, పూలు, మందులు వంటి వాటిని కూడా గంటలోపే డోర్డెలివరీ సేవలను అందించేలా స్విగ్గీగో నెట్వర్క్ను రూపొందించారు. ప్రధాన యాప్ లో భాగంగానే స్విగ్గీ గో పని చేస్తుంది.
పట్టణ వాసులకు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనశైలిని చేరువ చేయడంతో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టుగా సంస్థ సీఈవో శ్రీహర్షా మాజేటీ తెలిపారు. ఐదేళ్లుగా ఆహార పంపిణీలో సేవలు అందిస్తున్న తమ సంస్థ తాజాగా డోర్డెలివరీ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని అన్నారు.
2020 నాటికి బెంగళూరు, హైదరాబాద్ నగరాల పరిధిలో ఈ సేవలను పూర్తిగా విస్తరిస్తామని శ్రీహర్షా మాజేటీ చెప్పారు. మొత్తం 300 పట్టణాలకు వీటిని చేరువ చేయన్నుట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్లో తమ సంస్థ మొత్తం 200 సంస్థలతో జట్టుకట్టిందని వీటిలో రత్నదీప్, ఘనశామ్, స్నేహా చికెన్, యల్లో అండ్ గ్రీన్, 24 ఆర్గానిక్ మంత్రా వంటి సంస్థలు ఉన్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే బెంగళూరులో 300 మంది వ్యాపారులు స్విగ్గీతో జత కట్టారు. వీరిలో గోద్రేజ్ నేచర్ బాస్కెట్, నీల్ గిరీస్, ఆర్గానిక్ వరల్డ్, హెడ్అప్, టెయిల్స్ అండ్ నందూస్ చికెన్ తదితర సంస్థలు ఉన్నాయి. గుర్ గ్రామ్ నుంచి స్విగ్గీ స్టోర్స్ ప్రారంభించిన ఆరు నెలల్లోపే డెలివరీ సేవల్లోకి అడుగిడుతున్నది. ఏ రోజుకారోజు ‘స్విగ్గీ గో’ యాప్లో సభ్యత్వం కోసం స్టోర్టు ముందుకు వస్తున్నాయని శ్రీ హర్షా మాజేటీ చెప్పారు.