అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ ఆరోపణలు.. సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ నివేదిక , ఈ నెల 12న విచారణ
‘‘హిండెన్ బర్గ్ ’’ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ బుధవారం నివేదికను అందజేసింది. ఈ నెల 12న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం ఈ కేసు విచారించనుంది.
భారత కార్పోరేట్ రంగంలో సంచలనం సృష్టించిన ‘‘హిండెన్ బర్గ్ ’’ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ బుధవారం నివేదికను అందజేసింది. గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్ట్ ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ మారిషస్ కేంద్రంగా కంపెనీలను ఏర్పాటు చేసి, వాటికి నిధులు మళ్లింపు చేసిందని..మారిషస్ నుంచి షేర్లను కృత్రిమంగా కొనిపిస్తూ వాటి ధరలను పెంచుకుంటూ పోయిందని హిండెన్ బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అదానీ గ్రూప్ షేర్లు 70 శాతం వరకు పడిపోయాయి. అంతేకాదు ఇన్వెస్టర్లు సైతం లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు.
ఇదే సమయంలో హిండెన్ బర్గ్ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తమకు నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్ట్ సెబీని ఆదేశిస్తూ రెండు నెలలు గడువు విధించింది. అలాగే దీనికి సమాంతరంగా నిపుణులతో మరో కమిటీని కూడా నియమించింది. దీంతో ఈ కమిటీ మే 8న సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. అలాగే ఈ నెల 12న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం ఈ కేసు విచారించనుంది.