స్టాక్ మార్కెట్లకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. కీలక వడ్డీ రేట్లు పెంచడంతో వారంలోని మూడో ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 1306.96 పాయింట్లు నష్టపోయి 55,669.03 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 391.50 పాయింట్లు నష్టపోయి 16,677.60 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లోని అన్ని రంగాల సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను ఆకస్మికంగా పెంచడంతో ఈరోజు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం ట్రేడింగ్లో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ఈ రోజు రెపో రేటు మరియు సిఆర్ఆర్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. విశేషమేమిటంటే, ఈ ప్రకటనలు రిజర్వ్ బ్యాంక్ సాధారణ పాలసీ సమీక్ష నుండి వేరు చేసి మరీ ప్రకటించారు. దీని కారణంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత పరిస్థితులను చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మార్కెట్ గ్రహించింది.
బుధవారం నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1307 పాయింట్లు పతనమై 55,669 వద్ద, నిఫ్టీ 391 పాయింట్ల పతనంతో 16678 వద్ద ముగిశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఆల్ రౌండ్ పతనం చోటు చేసుకుంది. మెటల్ సహా పలు కీలక స్టాక్లలో గరిష్ట నష్టం కనిపించింది.
అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్లలో ఉండగా, ఓఎన్జిసి, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్లుగా లాభపడ్డాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, పవర్, మెటల్, రియాల్టీ, హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-3 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.63 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.11 శాతం పడిపోయింది.
మార్కెట్ ఎందుకు పతనమైంది.. ?
స్టాక్ మార్కెట్ ఈరోజు పతనానికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ అకస్మాత్తుగా రేట్లు పెంచడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు కంపెనీల బలహీన ఫలితాల వల్ల కూడా కొన్ని పెద్ద స్టాక్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ రోజు రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ తర్వాత తదుపరి పాలసీ సమీక్ష జూన్లో జరగాల్సి ఉంది. దీంతో జూన్లో రేట్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
అయితే సడెన్ గా ఇలా మధ్యంత భేటీ ద్వారా రెపో రేట్లు పెంచడం మార్కెట్కి ఊహించని విధంగా ఉంది. దీంతో టైటాన్ నిన్నటి ఫలితాల తర్వాత 4 శాతానికి పైగా పతనమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 3 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది.
