జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపు: ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తే శరణ్యమా?
తాజా పరిణామాలు జెట్ ఎయిర్వేస్పై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం.. పలు రాయితీల పేరిట నిధులను దారి మళ్లించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ముంబై శాఖ నిర్ధారించడమే దీనికి కారణమని సమాచారం.
న్యూఢిల్లీ: ఇటీవల తాత్కాలికంగా మూతపడిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం.. సదరు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి.
ఆర్వోసీ ముంబై విభాగం జెట్ ఎయిర్వేస్ ఖాతాల తనిఖీ నివేదికను ఇప్పటికే కార్పొరేట్ శాఖకు సమర్పించింది. జెట్ ఎయిర్వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్ఎఫ్ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం.
అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి.
జెట్ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు అరవింద్ గుప్తా అనే విజిల్ బ్లోయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడిట్ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్ ఎయిర్వేస్, జెట్లైట్ బ్రాండ్లు ప్రమోటర్ల కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు ఆధారంగానే ఆర్వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్ గుప్తాయే కావడం గమనార్హం.
మరోవైపు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో తెలిపింది. 52,775 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్ ఎయిర్వేస్ గోద్రెజ్ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్డీఎఫ్సీకి జెట్ ఎయిర్వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది.
ఇప్పటికే జెట్ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న బ్యాంకర్లు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
జెట్ ఎయిర్వేస్లో పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్ ఎయిర్వేస్ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
కాగా గత నెల రోజుల్లోనే ముగ్గురు కీలక వ్యక్తులు జెట్ ఎయిర్వేస్ సంస్థను వీడారు. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.