జంట సవాళ్లు: జెట్ఎయిర్వేస్పై దివాళా పిటిషన్.. వేతనాలకు పైలట్ల సమ్మె హెచ్చరిక
ప్పుడిప్పుడే ఆర్థిక కష్టాల నుంచి కోలుకుంటున్న జెట్ ఎయిర్వేస్ ఇంకా సమస్యలు తొలిగిపోయినట్లు కనిపించడం లేదు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్లు ఒకవైపు రూ.500 కోట్ల రుణం ఇచ్చినట్లే ఇచ్చి.. మరోవైపు తమ బకాయిల వసూలు కోసం ఎన్సీఎల్టీ మెట్లెక్కనున్నాయి. ఇదిలా ఉంటే పైలట్లు వచ్చేనెల ఒకటో తేదీ నాటికి తమ వేతనాలు చెల్లించాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేశాయి.
ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని భావిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’కు జంట సవాళ్లు పొంచి ఉన్నాయి. తమ రుణాల వసూళ్ల కోసం ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాళా పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జెట్ ఎయిర్వేస్ నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యవస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21వ తేదీన జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం)ఇటీవలే ఆమోదం తెలిపింది.
మరోవైపు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంక్ల కన్సార్షియమ్ జెట్ ఎయిర్వేస్కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ విషయమై ఎస్బీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎస్బీఐ గానీ, జెట్ ఎయిర్వేస్ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కాగా ఈ నెల 21వ తేదీన జరిగిన ఈజీఎంలో వివిధ ప్రతిపాదనలపై ఓటింగ్కు ఇతిహాద్ కంపెనీ దూరంగా ఉందని సంబంధిత వర్గాల కథనం.
జెట్ ఎయిర్వేస్లో ఇతిహాద్ ఎయిర్వేస్కు 24% వాటా ఉంది. ఎస్బీఐ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ల నుంచి మరిన్ని అదనపు నిధులు, ఈక్విటీ కేటాయింపు తదితర అంశాలపై మరింత స్పష్టత కోసం జెట్ ఎయిర్వేస్ వేచి చూస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ, ఎన్ఐఐఎఫ్లు 51% వాటా తీసుకోవాలని, దీని కోసం ఈ రెండు సంస్థలు రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఇతిహాద్ కోరుకుంటోందని ఆ వర్గాల కథనం. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ సంస్థకు తామిచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చినా, వాటిని రాబట్టుకునేందుకు బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చిన కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ను దాఖలు చేస్తాయి. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపితే సదరు సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా జెట్ ఎయిర్వేస్ పైలట్లకు సంబంధించిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ సమ్మెసైరన్ మోగించింది. వచ్చేనెల ఒకటో తేదీ నాటికి జీతాల చెల్లింపుపై స్పష్టతనివ్వకపోతే సమ్మెకు దిగడంతోపాటు తమ సంస్థ సభ్యులు కచ్చితంగా రోస్టర్ విధానానికి కట్టుబడి ఉండాలని కోరతామని పేర్కొంది.
రోస్టర్ విధానానికి కట్టుబడి ఉండాల్సి వస్తే డ్యూటీల విషయంలో చివరి నిమిషంలో జరిగే మార్పులను పైలట్లు అంగీకరించరు. ఆర్థిక కష్టాలతో ఉన్న జెట్ ఎయిర్వేస్ భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇంజినీర్లు, పైలట్లు, సీనియర్ మేనేజర్లకు భారీగా బకాయిపడింది. వీరికి ఫిబ్రవరిలో చెల్లిస్తానని హామీ ఇచ్చింది.
వీరికి డిసెంబర్ జీతం 100శాతం, 25శాతం నవంబర్ బకాయిలు దీంతోపాటు జనవరికి సంబంధించిన జీతంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. తాజాగా బ్యాంకుల నుంచి జెట్ రూ.500 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి మార్గం సుగమం కావడంతో పైలట్లు తాజా డిమాండ్ను తెరపైకి తెచ్చారు.