కస్టమర్లకు ఎస్బిఐ షాకింగ్ న్యూస్: పరిమితి మించితే చార్జీల మోతే!
ఇకపై నగదు ఉపసంహరణలో పరిమితి మించి లావాదేవీలు చేస్తే కచ్చితంగా రుసుము చెల్లించాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది.
ముంబై: కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్డౌన్ దశల వారీగా సడలిస్తుండటంతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) కొరడా ఝుళిపించింది. తమ బ్యాంకు శాఖల్లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలను ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. తమ బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై రుసుము కట్టాల్సి ఉంటుంది. కాగా చిన్న, నో ఫ్రిల్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు.
సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25 వేల వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. రూ. 50 వేల వరకు బ్యాంకులో నిల్వలు ఉంటే అయితే 10 విత్డ్రాయల్స్ ఉచితం.
ఖాతాదారులు రూ.50,000-100,000 ఉంటే 15, రూ.లక్షకు మించి ఏఎంబీ ఉంటే అపరిమితంగా నగదు వెనక్కి తీసుకోవచ్చు. పరిమితి దాటిన వారు మాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మాత్రం ఉచితంగా అపరిమిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
రూ.25వేలలోపు సగటు నెలవారీ మొత్తం ఉన్న వినియోగదారుడు ఏటీఎంలో ఉచితంగా ఎనిమిది లావాదేవీలు చేసుకోవచ్చు. ఎస్బీఐలో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు లావాదేవీలు ఉచితం. ఇవి ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి. ఇతర నగరాల్లో ఎస్బీఐలో 5, ఇతర ఏటీఎంలలో 5 లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
also read చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..? ...
రూ.25,000- రూ. లక్ష వరకు ఏఎంబీ ఉన్న ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. మెట్రోల్లో 3, ఇతర నగరాల్లో 5 చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు.
నిర్దేశించిన పరిమితిని దాటి ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కోదానికి రూ.10-20 వరకు జీఎస్టీని కలిపి రుసుముగా వసూలు చేస్తారు. ఇక సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల కోత విధించడంతో 31, మే నుంచి 2.7శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.