ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా?
డిజిటల్ వేదిక జియో వరుస పెట్టుబడుల సేకరణతో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రుణరహితంగా మారేందుకు కావాల్సిన నిధులను రాబట్టింది. అంతే ఉత్సాహంతో ఈ నెల 15వ తేదీన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అయితే, కరోనా మహమ్మారిని నివారించడానికి ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలయన్స్ ఏజీఎం సమావేశం కావడడం విశేషం..
ముంబై: రుణ రహిత కంపెనీగా మారనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్నది. ఈ సమావేశం వేదికగా రిలయన్స్ మరిన్ని భారీ ప్రకటనలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇప్పటికే భారీగా నిధులు సమీకరించిన డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్కు సంబంధించి, కొత్తగా ఆరంభించిన దృశ్యమాధ్యమ సమావేశ ఆన్లైన్ వేదిక జియోమీట్ గురించి 26 లక్షల మంది వాటాదార్లకు తీపికబుర్లు చెబుతారని అంచనా వేస్తున్నారు.
ఇక ఆర్ఐఎల్ అనుబంధ రిలయన్స్ రిటైల్కు చెందిన ఇ-కామర్స్ ప్లాట్పామ్ జియోమార్ట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాలలో సేవలు ప్రారంభించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో నిత్యావసరాలు కూడా ఆన్లైన్లో తెప్పించుకోవడం పెరుగుతోంది. కోట్ల మంది చిరువ్యాపారులతో అనుసంధానమయ్యే జియోమార్ట్ను ఈ రంగంలో దిగ్గజ సంస్థగా నిలబెట్టాలన్నది రిలయన్స్ ప్రణాళిక.
ఫేస్బుక్ నేరుగా జియో ప్లాట్ఫామ్స్లో దాదాపు 10 శాతం వాటా కొనుగోలు చేయగా, ఫేస్బుక్ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ సాయంతో జియోమార్ట్ కార్యకలాపాలు సాగుతున్నాయి. భారీగా నిధులు సమీకరించిన జియో ప్లాట్ఫామ్స్ను అంతర్జాతీయ స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రకటన కోసం వాటాదార్లంతా ఎదురు చూస్తున్నారు.
also read ఐఆర్సీటీసీ ఆర్థిక ఫలితాల జోరు.. 80శాతం పెరిగిన నికరలాభం.. ...
దేశీయ మొబైల్ మార్కెట్ రంగంలో రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. 36% వాటా పొందింది. 2024 నాటికి సబ్ స్క్రైబర్ల పరంగా 41% వాటా, ఆదాయం పరంగా 44% వాటా సాధించాలని సంస్థ లక్ష్యం. వైరుతో అత్యధిక వేగం బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే జియో ఫైబర్పై సంస్థ మరింత దృష్టి సారించే అవకాశం ఉంది.
చమురు-రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను ప్రపంచంలోనే ముడి చమురు అధికంగా ఎగుమతి చేసే సంస్థ సౌదీ చమురు అగ్రగామి సంస్థ ఆరామ్కో. ఈ సంస్థకు రిలయన్స్ సుమారు రూ.1,12,500 కోట్ల (2,000 కోట్ల డాలర్ల)కు 20 శాతం వాటా విక్రయానికి సంప్రదింపులు జరుగుతున్నాయని గతేడాది ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి విదితమే.
ఆరామ్కో ఒప్పందంపై చేసే వ్యాఖ్యలు షేరు కదలికలనూ ప్రభావితం చేస్తాయి. రిలయన్స్ టౌన్షిప్లో సుజుకీ ప్లాంట్జపాన్ కంపెనీ సుజుకీ (టీసుజుకీ) హర్యానాలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ (ఎంఈటీఎల్)లో తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది.
వాహన పరిశ్రమకు అవసరమైన స్టీరింగ్ నకుల్ను ఇక్కడ తయారు చేస్తారు. గతేడాది సంస్థ వార్షిక సమావేశంలో రూ.3.5 లక్షల కోట్ల డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, జియో ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది.
2018లో రూ.501 చెల్లించి సరికొత్త జియోఫోన్ పొందే వీలు కల్పించింది రిలయన్స్. అంతకుముందు 2017లో రిఫండబుల్ డిపాజిట్ రూ.1500తో రిలయన్స్.. జియో ఫోన్ ఆవిష్కరించింది