ఆన్లైన్ లోన్ యాప్లు, డిజిటల్ రుణాల వ్యవహారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అమాయకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది
ఆన్లైన్ లోన్ యాప్లు, డిజిటల్ రుణాల వ్యవహారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అమాయకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది.
డిజిటల్ లోన్లపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. లోన్ యాప్లు, ఇతర డిజిటల్ లోన్లను ఈ గ్రూప్ పరిశీలిస్తుంది. అంతేకాకుండా వీటిలోని లోటుపాట్లపై కూడా అధ్యయనం చేస్తుంది.
ఆర్థిక రంగంలో వివిధ డిజిటల్ పద్దతుల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడమనేది స్వాగతించదగిన విషయం. దీని ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ప్రమాదాలు కూడా అంతే పొంచివున్నాయని ఆర్బీఐ తెలిపింది.
ఈ విషయంలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని, డేటా భద్రత, ప్రైవసీ, నమ్మకం, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు తగిన విధంగా నియమ నిబంధనలు తయారు చేయాలని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇస్తూ బాధితులను వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.
కాగా, గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 10కి పైగా డిజిటల్ యాప్లు రుణాలను మంజూరు చేస్తున్నాయి. వీటి ద్వారా రుణాలు పొంది, వడ్డీలు కట్టలేక దేశవ్యాప్తంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
