300 రకాల బ్రాండ్స్ ఇప్పుడు ఒకేచోట.. ఢిల్లీలో ‘‘రిలయన్స్ సెంట్రో’’ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైడ్ డిపార్ట్మెంటల్ స్టోర్ ‘‘రిలయన్స్ సెంట్రో’’ తొలి స్టోర్ను ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ప్రారంభించింది. ఇక్కడ 300కి పైగా భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన దుస్తులు, పాదరక్షలు, సౌందర్య సాధనాలు, లో దుస్తులు, స్పోర్ట్స్వేర్లతో పాటు సామాన్లు, యాక్సెసరీలు అందుబాటులో వుంచింది.
భారతదేశపు అతిపెద్ద రిటైల్ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ తన ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైడ్ డిపార్ట్మెంటల్ స్టోర్ ‘‘రిలయన్స్ సెంట్రో’’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని వసంత్ కుంజ్లో తన తొలి ఔట్లెట్ను మంగళవారం ప్రారంభించింది. రిలయన్స్ సెంట్రోలో 300కి పైగా భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన దుస్తులు, పాదరక్షలు, సౌందర్య సాధనాలు, లో దుస్తులు, స్పోర్ట్స్వేర్లతో పాటు సామాన్లు, యాక్సెసరీలను అందుబాటులో వుంచినట్లు సంస్థ తెలిపింది. వసంత్ కుంజ్లోని స్టోర్ ఆధునిక కాలానికి అనుగుణంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఢిల్లీలో మహిళలు, పురుషులు, పిల్లలకు విస్తృతశ్రేణి ఉత్పత్తులతో పాటు అత్యాధునిక ఫ్యాషన్తో పాటు ప్రత్యేకమైన, అద్భుతమైన షాపింగ్ అనుభూతిని పొందవచ్చని రిలయన్స్ వెల్లడించింది. దాదాపు 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి వున్న ఈ ఔట్లెట్లో 300కు పైగా బ్రాండ్లు, 20 వేలకు పైగా స్టైల్స్ వున్నాయి. రూ.3,999 విలువైన షాపింగ్పై రూ.1,500 తగ్గింపును... రూ.4,999 అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్పై రూ.2,000 తగ్గింపును ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు అందజేస్తున్నట్లు తెలిపింది.
గత నెలలో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ తన రిటైల్ కంపెనీ భాగస్వామ్యాల్లో రూ.9,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. జస్ట్ డయల్, 7-ఎలెవెన్, మిల్క్ బాస్కెట్, కళానికేతన్, రీతూ కుమార్ వంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు అంబానీ పేర్కొన్నారు. తద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో 2,500 కొత్త స్టోర్లను సృష్టించగా.. ప్రతిరోజూ 7 కొత్త స్టోర్లు ఏర్పడ్డాయి.