Asianet News TeluguAsianet News Telugu

అనిల్ అంబానీని నమ్మలేం.. జైలుకెళ్లాల్సిందే: ఎస్బీఐ

బ్యాంకుల వద్ద తమ ఖాతాల్లో ఐటీ శాఖ నుంచి రీఫండ్ అయిన రూ.260 కోట్లను విడుదల చేసేందుకు అనుమతించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎన్సీఎల్ఏటీలో చుక్కెదురైంది.

Refuse to believe Rcom will let Anil Ambani go to jail, says SBI
Author
Mumbai, First Published Mar 14, 2019, 3:53 PM IST

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీకి జైలు తప్పేలా లేదు. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు అనిల్ అంబానీ కష్టాలు కొనసాగుతున్నాయి.

వివిధ బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో ఉన్న ఆదాయం పన్ను (ఐటీ) రిఫండ్స్ రూ.260 కోట్ల సొమ్మును విడుదల చేయాలన్న ఆర్‌-కామ్ పిటిషన్‌పై ఆదేశాలను నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్‌ఏటీ) రిజర్వులో పెట్టింది. 

ఆర్‌-కామ్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రుణాల చెల్లింపులలో విఫలమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థను, దాని అధినేత అనిల్ అంబానీని నమ్మలేమని 37 మంది రుణదాతల తరఫున వాదిస్తున్న ఎస్బీఐ తరఫు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ స్సష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినందుకు అనిల్ అంబానీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. ఈ నెల 19లోగా ఎరిక్సన్ బకాయిలు చెల్లించకపోతే అనిల్ అంబానీ జైలుకు వెళ్లక తప్పదు. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న చైర్‌పర్సన్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం.. బుధవారం తమ ఆదేశాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

అదే సమయంలో ఎరిక్సన్ బకాయిలను ఎలా తీరుస్తారని రిలయన్స్ కమ్యూనికేషన్స్ న్యాయవాది కపిల్ సిబాల్ ను ప్రశ్నించింది. దీనిపై బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం గానీ, ఇతర మార్గాల్లో పరిష్కరించుకుంటామని సిబల్ సమాధానం ఇచ్చారు. 

దీంతో ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడకుండా పోయింది. కాగా, ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

లేనిపక్షంలో జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని హెచ్చరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పటికే రూ.118 కోట్లు చెల్లించినందున, మిగతా మొత్తాన్ని ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తమ ఖాతాల్లో ఉన్న ఐటీ రిఫండ్స్ సొమ్మును బకాయిల చెల్లింపునకు వినియోగించుకోవాలని ఆర్‌కామ్ భావించింది. 

కానీ సంస్థ దివాలా ప్రక్రియలో ఉన్నందున ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ఆర్‌కామ్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, రుణదాతల తరఫున మరో సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదిస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ సెటిల్మెంట్ కోసం ప్రజా ధనాన్ని ఉపయోగించలేమని బ్యాంకర్లు వాదిస్తున్నారు.

సకాలంలో ఎరిక్సన్ బకాయిలు చెల్లించకపోతే దివాళా ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని రిలయన్ష్ కమ్యూనికేషన్ యాజమాన్యానికి ఎన్సీఎల్ఏటీ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఆర్‌కామ్ తాకట్టు పెట్టిన 12 కోట్ల షేర్లను బుధవారం బ్యాంకర్లు అమ్మేశారు.

ఈ మొత్తం సంస్థలోని 4.34 శాతం ప్రమోటర్ల వాటాకు సమానం. అమ్మిన షేర్లు అనిల్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర ఆర్‌కామ్ గ్రూప్ సంస్థలవని బ్యాంకులు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios