రిస్క్ తగ్గితేనే ‘రేట్స్’ కట్: డిఫరెన్సెస్పై నో కామెంట్
మున్ముందు ద్రవ్యోల్బణం రిస్క్ తగ్గితేనే భవిష్యత్లో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉన్నదని ఆర్బీఐ తేల్చేసింది. కాకపోతే నిధుల లభ్యత కోసం ఎస్ఎల్ఆర్ నిష్పత్తిని 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది. బ్యాంకర్లు, కార్పొరేట్లు కూడా ఆర్బీఐ విధానంపై సంత్రుప్తి వ్యక్తం చేశారు. కాకపోతే ఇటీవల ఆర్బీఐకి, కేంద్రానికి మధ్య తలెత్తిన విభేదాలపై మాత్రం బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నోరు మెదపలేదు.
ముంబై: ద్రవ్యోల్బణం పెరుగుదలకు పొంచి ఉన్న రిస్క్ తగ్గితేనే భవిష్యత్లో డ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం ఉందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంకేతాలిచ్చారు. ద్రవ్యోల్బణం ఇటీవల ఆశ్చర్యకరంగా దిగి వచ్చినా ఈ ధోరణి నిలకడగా కొనసాగుతుందా? లేదా? తెలియాలంటే మరింత డేటాను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ‘ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు గనుక తొలగిపోవడం లేదా తగ్గుముఖం పట్టడం జరిగితే తదుపరి గణంకాల్లో దాని ప్రభావం కనబడుతుంది. ఇదే జరిగితే వడ్డీరేట్ల తగ్గింపునకు చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది’ అని ఉర్జిత్ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక అంశాలపై మీడియా ప్రశ్నలపై స్పందించేందుకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిరాకరించారు.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో రేటు 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రెండుసార్లు (జూన్, ఆగస్ట్ నెలల్లో) రెపో రేటును పావు శాతం చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
డాలర్తో రూపాయి మారకం విలువ ఘోరంగా పడిపోయినా అక్టోబర్ పాలసీ సమీక్షలో రెపో రేటును పెంచకుండా ఆర్బీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నది. అంతేకాక తటస్థ పరపతి విధానం నుంచి రేట్ల పెంపుకు మారుతున్నట్లు పేర్కొంది. కాగా, తాజా పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఒకరైన రవీంద్ర ధోలకియా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత కఠిన పాలసీ విధానాన్ని మళ్లీ తటస్థానికి మార్చే ప్రతిపాదనకు ఒక సభ్యుడే అనుకూలంగా ఓటేశారన్నారు.
అదే సమయంలో చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)ని దశలవారీగా 18 శాతానికి చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీనికోసం ఎస్ఎల్ఆర్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి పావు శాతం కోత విధించనున్నట్లు తెలిపింది. 2019 తొలి త్రైమాసికం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లు, ఇతర సాధనాల్లో కచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పరిమాణాన్ని ఎస్ఎల్ఆర్గా వ్యవహరిస్తారు. దీన్ని తగ్గించటం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి.
ఎస్ఎల్ఆర్ నిష్పత్తి పెరుగుదలతో బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెరుగుతుంది. తద్వారా బ్యాంకుల రుణ వితరణ కూడా పెరిగేందుకు దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఎస్ఎల్ఆర్ 19.5%గా ఉంది. ఆర్బీఐ తాజా ప్రతిపాదన ప్రకారం 2020 జూన్ నాటికి 18% ఎస్ఎల్ఆర్ లక్ష్యం నెరవేరనుంది. కాగా, ఆర్బీఐ తాజా చర్యలతో వచ్చే 18 నెలల్లో దాదాపు రూ.1–1.5 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఎల్ బ్యాంక్ ఎకనమిస్ట్ రజని థాకూర్ పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. గత పాలసీ సమీక్షలో 3.9–4.5 శాతంగా అంచనా వేసింది. దీన్ని ఇప్పుడు 2.7–3.2 శాతానికి కోత విధించింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యానికి చాలా దిగువనే తాజా అంచనాలు ఉన్నాయి.
‘గత పాలసీ సమీక్ష సందర్భంగా ప్రస్తావించిన కొన్ని ద్రవ్యోల్బణం రిస్కులు ఇప్పుడు శాంతించాయి. ముడిచమురు ధరలు దిగిరావడం ఇందులో ప్రధానమైంది. భవిష్యత్లో ద్రవ్యోల్బణం విషయంలో పలు అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఉన్నాయి’ అని ఆర్బీఐ పేర్కొంది. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్టమైన 3.31 శాతానికి దిగొచ్చిన సంగతి తెలిసిందే.
2018–19 ఏడాది ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 7.4 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం వంటివి మన ఆర్థిక వ్యవస్థలో మందగమన రిస్కులను పెంచొచ్చని ఎంపీసీ వ్యాఖ్యానించింది.
గరిష్ట స్థాయిల నుంచి పడిపోయిన ముడిచమురు ధరలు ఇలాగే కొనసాగితే సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ ఆరంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 85 డాలర్లను తాకి.. తాజాగా 60 డాలర్ల దిగువకు పడిపోవడం తెలిసిందే. కాగా, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవాలని.. దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకమని ఎంపీసీ స్పష్టం చేసింది.
ఆర్బీఐ వద్దనున్న మిగులు నిధుల్లో కొంతమొత్తాన్ని(రూ.3 లక్షల కోట్లు) కేంద్ర ప్రభుత్వం తమకు బదలాయించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ‘ఆర్బీఐ స్వేచ్ఛ విషయంలో ఇటీవల వెలువడిన కథనాలకు సంబంధించి మీరడిగిన ప్రశ్నలకు ఎంపీసీ తీర్మానానికి ఏమైనా సంబంధం ఉందా? మేం పరపతి విధానం, స్థూల ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు సమావేశమయ్యాం. అందుకే దీనిపై మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను’ అని ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు.
కీలక రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆచరణాత్మకంగా, సర్దుబాటు తీరులోమార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉందని బ్యాంకర్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగేందుకు రిస్క్లు ఉన్నా, భవిష్యత్లో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ నిర్ణయం ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. పాలసీ గైడెన్స్ మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉందని, ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్బీఐ తగ్గించడమన్నది మరింత స్థిరమైన, ఊహించతగిన వడ్డీ రేట్ల విధానంపై మార్కెట్ వర్గాల్లో భరోసా కల్పించిందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరిగే విషయంలో ఉన్న రిస్క్లు ఆచరణలో కనిపించకపోతే పాలసీ విధానం మార్చుకునే అవకాశం ఉందన్న విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారని ఐసీఐసీఐ బ్యాంకు గ్లోబల్ మార్కెట్స్ గ్రూప్ అధిపతి బీ ప్రసన్న తెలిపారు. రేట్ల పరంగా తటస్థ విధానాన్ని ఎంపీసీ ఎక్కువ కాలం పాటు కొనసాగిస్తుందని భావిస్తున్నామని, ఇది రేట్ల తగ్గింపు అవకాశాలపై మాకు నమ్మకం కలిగిస్తోందని ఐసీఐసీఐ బ్యాంకు గ్లోబల్ మార్కెట్స్ గ్రూపు హెడ్ ప్రసన్న తెలిపారు.
ఆర్బీఐ రేట్లలో మార్పులు చేయకపోవడం నిధుల వ్యయాల విషయంలో నమ్మకాన్ని కలిగిస్తుందని బంధన్ బ్యాంక్ సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ వ్యాఖ్యానించారు. రుణాలపై ఫ్లోటింగ్ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్మార్క్లతో అనుసంధానించడం అనేది దీర్ఘకాలంలో రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై వ్యయాలు తగ్గడానికి దారితీస్తుందని బంధన్ బ్యాంక్ సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ పేర్కొన్నారు.
పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. ‘ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే తక్షణం వ్యవస్థలో రుణ వితరణ మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వృద్ధి రేటు మందగమనం సంకేతాలు వెలువడ్డాయి. ముడిచమురు ధరలు దిగొచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ రషేశ్ షా పేర్కొన్నారు.
రూపాయి విలువ మళ్లీ పుంజుకోవడం, క్రూడ్ ధరల క్షీణత, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం వంటివి ఆర్బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు కారణమని అసోచామ్ వ్యాఖ్యానించింది. కాగా, ఎక్కడి రేట్లను అక్కడే కొనసాగించడాన్ని రియల్టీ రంగం స్వాగతించింది. రెపో రేటును పెంచకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుందని.. అమ్మకాలు మెరుగుపడతాయని అభిప్రాయపడింది.