బెస్ట్ ఇండస్ట్రీయలిస్ట్ రతన్టాటా: ఆయనకు ఏ కార్లంటే ఇష్టమో తెలుసా?
రతన్ టాటా అంటే పరిచయం అక్కర్లేని భారత పారిశ్రమికవేత్త.. అంతేకాదు.. ఆయనకు విలువలతో కూడిన దిగ్గజ వ్యాపారవేత్తగా ఎంతో పేరుంది. అన్నింటా తనదైన మార్క్తో దూసుకెళ్తున్నాయి టాటా సంస్థలు. మరి అలాంటి సంస్థ అధిపతికి కార్లంటే అమితమైన ప్రేమ. అందుకే రతన్ టాటా గ్యారేజ్లో రూ. కోట్ల విలువైన కార్లు దర్శనమిస్తాయి
న్యూఢిల్లీ: రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా పేరొందిన గొప్పవ్యక్తి. ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు కొన్ని అభిరుచులూ, ఇష్టాయిష్టాలున్నాయి. వాటిల్లో ఒకటి కార్ల సేకరణ ఒకటి. అందుకే ఆయన గ్యారేజ్లో విలువైన కార్లు దర్శనం ఇస్తాయి.
పాత తరం నుంచి లేటెస్ట్ మోడళ్ల వరకు ఎన్నో కార్లను రతన్ టాటా సొంతం చేసుకున్నారు. వాటిల్లో టాటా నిక్సన్, మెర్సిడెస్ బెంజ్, కార్డిల్లాక్ ఎక్స్ఎల్ఆర్, క్రిస్లెర్ సెబ్రింగ్, టాటా ఇండిగో వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ కలెక్షన్లోని కొన్ని లగ్జరీ కార్లపై ఓ లుక్కేద్దాం.
ఎలాంటి వాతావరణంలోనైనా, కొండల్లోనైనా దూసుకెళ్లగల సత్తా లాండ్ రోవర్ ఫ్రీ లాండర్ మోడల్ కారు సొంతం. 2014లోనే ఈ మోడల్ తయారీని నిలిపివేసినా అంతకుముందే రతన్ టాటా దీన్ని సొంతం చేసుకున్నారు.
నాలుగు సిలిండర్లు కల డీజిల్ ఇంజిన్ లాండ్ రోవర్ ఫ్రీ లాండర్లో ఉంటుంది. ఇది 187 బీహెచ్పీ(బ్రేక్ హార్స్ పవర్), 420 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 గేర్లతో ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉంటుంది. దీని ధర రూ.44 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది.
చూడగానే వావ్ అనిపించే డిజైన్, చూడగానే ఆకట్టుకునే రంగు మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి లగ్జరీ కారు సొంతం. తొలిచూపులోనే ఎవరైనా దీని మాయలో పడాల్సిందే. అందుకే రతన్ టాటాను కూడా మెప్పించగలిగింది.
జర్మనీ సంస్థ తయారు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మోడల్ కారును రతన్ టాటా సొంతం చేసుకున్నారు. 3982 వీ8 పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ గేర్బాక్స్, గంటకు 300 కి.మీ. వేగం ఈ కారు ప్రత్యేకతలు. లీటర్ మీద 7 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ధర రూ.2.55 కోట్లు పలుకుతుంది.
టాటా మోటార్స్ సంస్థ తయారు చేసిన టాటా నెక్సాన్ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అందుకే మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధర ఉన్నా ఈ ఎస్యూవీకి రతన్ టాటా గ్యారేజ్లో చోటు దక్కింది. చూడటానికి స్పోర్ట్స్ కారులా ఉండటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో దీనికి భారీ డిమాండ్ లభించింది.
టాటా నెక్సాన్ కారును రెండు రంగుల్లో విడుదల చేశారు. ఇందులో నీలం రంగు కారులో టాటా చాలాసార్లు కనిపించారు. ఈ మోడల్లో 1.2 లీటర్ల పెట్రోల్ టర్బో ఇంజిన్, 1.5 లీటర్ల ఇంజిన్తో రెండు రకాల కార్లు వచ్చాయి. దీని ధర రూ.6.95 లక్షలు ఉంటుంది.
ఎరుపు రంగు ఫెరారీ కాలిఫోర్నియా మోడల్ కారును కూడా రతన్ టాటా కొనుగోలు చేశారు. రెండు డోర్లు ఉండే ఈ ఓపెన్ టాప్ కారు అంటే టాటాకు చాలా ఇష్టం. పలు సర్లు ఈ కారుపై కనిపించారు. 4.3 లీటర్ల వీ8 ఇంజిన్, 504 ఎన్ఎం టార్క్, 552 బీహెచ్పీ దీని సొంతం.
ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తి మన దేశంలో జరగట్లేదు. ఫెరారీ విడుదల చేసిన అన్ని మోడళ్లలో ఇది బాగా ఆకట్టుకుంది. దీని ధర రూ.3.13 కోట్ల నుంచి ప్రారంభం అవుతుంది.
ఇటాలియన్ మోడల్లో ఉండే మసెరటి క్వట్రోపోర్టే కారుకు రతన్ టాటా గ్యారేజ్లోనూ చోటు దక్కింది. ఈ లగ్జరీ స్పోర్ట్స్ సెడాన్ను చాలా మంది తమ డ్రీమ్ కారుగా భావిస్తారు. రెండు టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్లతో ఇది నడుస్తుంది. దీని ఇంజిన్ 424 బీహెచ్పీ పవర్, 580 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
also read పెరిగిన బంగారం, వెండి ధరలు... 10గ్రాములకు ఎంతంటే..? ...
270 కి.మీ/గంటకు వేగంతో మసెరటి క్వట్రోపోర్టే మోడల్ దూసుకెళ్తుంది. ఇందులోని జీటీఎస్ వెర్షన్లో ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 530 బీహెచ్పీ పవర్, 710 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.71 కోట్లు పలుకుతుంది.
సూపర్ లైట్లో ఉండే మెర్సిడెస్ బెంజ్ 500 ఎస్ఎల్ కారు రతన్ టాటా కలెక్షన్స్లో ఒకటి. 5 లీటర్ల వీ8 ఇంజిన్తో పనిచేసే ఈ కారు.. 8.1 కి.మీ/లీటరు మైలేజ్నిస్తుంది. 392 బీహెచ్పీ పవర్, 530 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.15 కోట్లు ఉంటుంది.
రతన్ టాటా గ్యారేజ్లో ఎక్కువ కాలంగా ఉన్న వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది టాటా ఇండిగో మరినా. ఈ కారులో రతన్ టాటా చాలా సార్లు కనిపించారు. వీటితో పాటు టాటా వద్ద క్రైస్లర్ సెబ్రింగ్, మెర్సిడెజ్ బెంజ్ డబ్ల్యూ 124, క్యాడలిక్ ఎక్స్ఎల్ఆర్ వంటి విభిన్న మోడల్ కార్లు కూడా ఉన్నాయి.
అందరికీ అందుబాటులో విలువలు కల వ్యాపారిగా పేరు ఉన్న రతన్ టాటా అతితక్కువ ధరలో కారును ప్రజలకు అందించాలని 'టాటా నానో'ను తీసుకు వచ్చారు. రతన్ టాటా ఒకసారి నలుగురు కుటుంబసభ్యులు ఒకే మోటార్సైకిల్పై వానలో తడుచుకుంటూ వెళ్లటం చూశారు.
అంతే రతన్టాటా మధ్య తరగతి కోసం సరసమైన ధరలో ఒక కారు తయారుచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అలా నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
‘నానో కారు తయారు చేయడానికిఖర్చులు ఎక్కువ. కానీ నేను మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కారు పట్ల ఇప్పటికీ నేను గర్వంగానే ఉన్నా. అదే నిర్ణయంతో ముందుకెళ్లాననుకుంటున్నా’ అని రతన్ టాటా చెప్పారు.
పది సంవత్సరాల క్రితం విడుదలైన నానో కారు అమ్మకాల పరంగా నిరాశపరచింది. భద్రతా కారణాలు, ఇంజిన్లో సమస్యల కారణంగా ప్రజలు దీని కొనుగోలుపై ఆసక్తి చూపలేదు.
82 ఏళ్ల రతన్ టాటా.. సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందు వరుసలోనే నిలుచుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న వేళ.. రతన్ టాటా 1500 కోట్ల రూపాయల భారీ సాయం అందించారు.
రూ.500 కోట్లు టాటా ట్రస్టుల తరఫున రతన్ టాటా, మరో రూ.1000కోట్లు టాటా గ్రూపుల తరఫున అందించారు. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం టాటా గ్రూపులకు చెందిన తాజ్ హోటల్ను అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును అందజేశారు.