అమ్మబాబోయ్!!ప్రైవేట్ బ్యాంకులు వేస్ట్ :ప్రభుత్వ బ్యాంకులే బెస్ట్
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల ఇంటి నుంచే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులను బ్యాంకులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల ఇంటి నుంచే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులను బ్యాంకులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులతో వేగలేమని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న అధికశాతం మంది అభిప్రాయపడ్డారు.
ఐఎన్ఎస్ సీ-వోటర్ నిర్వహించిన సర్వేలో 1,200 మందిలో అత్యధిక శాతం.. ప్రభుత్వరంగ బ్యాంకులపై నమ్మకాన్ని వ్యక్తం చేయగా, అదే ప్రైవేట్రంగ బ్యాంకుల పనితీరుపై పెదవి విరిచారు. 60 ఏళ్ల పై చిలుకు వారైతే తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మారనున్నట్లు ప్రకటించారు. 12.7 శాతం మందిలో 12 శాతం మంది కో-ఆపరేటివ్ బ్యాంకుల వైపు మొగ్గుచూపగా, మిగతా 0.7 శాతం మంది ప్రభుత్వ రంగ బ్యాంకులే బెట్టరని అభిప్రాయపడ్డారు.
45 నుంచి 60 ఏళ్లలోపు వారిలో బ్యాంక్ ఖాతాలు కలిగిన 5.1% మందిలో 3.8 శాతం మంది తమ ఖాతాలను ప్రభుత్వరంగ బ్యాంకులోకి మారనున్నట్లు చెప్పగా.. 1.3 శాతం మంది కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరువాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
25 నుంచి 45 ఏళ్లలోపు వారు ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ లేదా కో-ఆపరేటివ్ బ్యాంకులకు మారాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారితోపాటు పట్టణాల్లో ఉన్నవారు కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఇతర బ్యాంకులకు మారాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వరంగ బ్యాంకులు శాఖలు కలిగి ఉండటం ప్రభుత్వరంగ బ్యాంకులకు కలిసొచ్చింది.
మరోవైపు బ్యాంకుల సీఈఓలు, హోల్ టైమ్ డైరెక్టర్ల వయసు, పదవీ కాలాలపై గరిష్ఠ పరిమితి విధించాలని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రతిపాదించింది. వీరెవరూ ఈ పదవుల్లో వరుసగా 10- 15 ఏళ్లకు మించకుండా ఉండేలా ఆంక్షలు విధించాలని నిర్ణయానికి వచ్చింది.
అలాగే ప్రస్తుతం ఉన్న 70 ఏళ్ల గరిష్ఠ వయో నిబంధన కూడా గట్టిగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఒక చర్చాపత్రాన్ని ఆర్బీఐ విడుదల చేసింది.
ప్రమోటర్లు లేదా ప్రధాన వాటాదార్లే సీఈఓలు, డబ్ల్యుటీడీలైతే వారి పదవీ కాలాన్ని నియంత్రించాలన్న నిబంధన అమల్లోకి వస్తే కోటక్ మహీంద్ర బ్యాంకు సీఈఓ ఉదయ్ కోటక్ వెంటనే పదవి నుంచి తప్పుకోవలసి ఉంటుంది.
ఉదయ్ కొటక్ 2003 నుంచి బ్యాంకు సీఈఓగా కొనసాగుతున్నారు. వృత్తి నిపుణులు సీఈఓలు, హోల్టైమ్ డైరెక్టర్లుగా ఉన్నా వారి పదవీ కాలమూ 70 ఏళ్ల గరిష్ఠ వయో నిబంధనకు లోబడి వరుసగా 15 సంవత్సరాలు మించకూడదని ఆర్బీఐ సూచించింది. ఈ పత్రంపై వచ్చే నెల 15లోగా అభిప్రాయాలు తెలియజేయాలని బ్యాంకర్లు, నిపుణులను కోరింది.
కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఇప్పటికీ ప్రమోటర్ల హవా నడుస్తోంది. వారే చైర్మన్లు, సీఈఓలుగా హోల్ టైమ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. దాంతో ప్రమోటర్లు - మేనేజ్మెంట్ మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ చెరిగి పోతోంది. చాలా సందర్బాల్లో బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులూ ప్రమోటర్ల అక్రమాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి.
యస్ బ్యాంక్ ప్రధాన ప్రమోటర్గా రాణా కపూర్ సాగించిన రుణ దందాలే ఇందుకు ఉదాహరణ. వృత్తి నిపుణులనే సుదీర్ఘ కాలం ఆ పదవుల్లో కొనసాగిస్తే, చందా కొచార్లా బ్యాంకు నిధులను గుట్టుగా కావలసిన వారికి ‘రుణా’ల రూపంలో పంచిపెట్టే ప్రమాదం ఉందని ఆర్బీఐ భావిస్తోంది.