కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరింత ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరింత ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది. గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తాజాగా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత తగ్గించింది . గత అక్టోబర్‌లో ఎడిబుల్ ఆయిల్‌లపై ప్రకటించిన కస్టమ్స్ డ్యూటీ మరియు సెస్ రిలీఫ్‌ను సెప్టెంబర్ 2022 చివరి వరకు పొడిగించింది. ఇక ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా వంటనూనె ధరలు నియంత్రించడంతో పాటు దేశీయ ప్రాసెసింగ్‌ కంపెనీలకు మద్దతునిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ మరియు కస్టమ్స్ (CBIC) నుండి అధికారిక ఉత్తర్వు ప్రకారం గత అక్టోబర్‌లో ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్ 2022 మార్చి చివరి నాటికి ముగుస్తుంది. అయితే దానిని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులో ఉంటుంది.దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్‌ను గత ఏడాది 20% నుండి 7.5% కి తగ్గించారు. ఆదివారం నుండి 5% కి తగ్గించారు.

అంతేకాకుండా, కందిపప్పు విషయంలో, దిగుమతులపై ఎటువంటి సెస్ ఉండదు. డిసెంబరు నెలలో నివేదించబడిన 'నూనెల' విషయంలో సంవత్సరానికి 24% పైగా ద్రవ్యోల్బణం నేపథ్యంలో, ఎడిబుల్ ఆయిల్స్‌పై సుంకం రాయితీని పొడిగించడం మరియు పామాయిల్ దిగుమతులపై వ్యవసాయ సెస్‌ని తగ్గించడం జరిగింది. గత డిసెంబర్‌లో మొత్తం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.59%గా ఉంది. నవంబర్‌లో 4.91%తో పోలిస్తే ఎక్కువగా ఉంది.

క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ మరియు క్రూడ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్‌పై గతేడాది ప్రకటించిన ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్-2.5% నుంచి సున్నాకి చేసిన తగ్గింపు ఇప్పుడు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం డిసెంబర్‌లో శుద్ధి చేసిన పామాయిల్ మరియు దాని భిన్నాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 17.5% నుండి 12.5%కి తగ్గించింది. ఇది కూడా సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది.

అలాగే.. ముడి సోయా-బీన్ నూనె మరియు ముడి పొద్దుతిరుగుడు నూనె రెండింటిపై వ్యవసాయ సెస్‌పై ఉపశమనం-20% నుండి 5% వరకు తగ్గింపు ఇచ్చింది. ఇది సెప్టెంబర్ చివరి వరకు అమలులో ఉంటుంది. ఈ చర్య దేశీయ రిటైల్ ధరలను తగ్గించి వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు అధికంగా ఉంటే దేశీయ వంటనూనెల ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.