కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను టార్గెట్ చేశారు.ఇలా కాంగ్రెస్ నేత పి. చిదంబరం ట్వీట్ చేస్తూ, 'ద్రవ్యోల్బణం 7.01%, నిరుద్యోగం 7.8% వద్ద ఉన్న రోజున ఆర్థిక మంత్రి బృహస్పతి, ప్లూటో, యురేనస్ గ్రహాలకు చెందిన చిత్రాలను ట్వీట్ చేయడం మాకు ఆశ్చర్యం కలిగించట్లేదు అంటూ చమత్కరించారు.
నిర్మలా సీతారామన్ తన ఆర్థిక సలహాదారుపై ఆశలు వదులుకున్నారని ట్వీట్లో పేర్కొన్నాడు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగదల కోసం గ్రహ స్థితి చూడటం ఒక్కటే మిగిలిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ల కన్నా కూడా చీఫ్ ఎకనామిక్ ఆస్ట్రాలజర్ ల అవసరం ప్రధానంగా ఉందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవన దిశగా తీసుకెళ్లడం కంటే యురేనస్, ప్లూటోలపై సీతారామన్కు ఎక్కువ ఆసక్తి ఉందని కాంగ్రెస్ బుధవారం విమర్శించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్పై దుమారం..
వాస్తవానికి నాసా సంస్థ ట్వీట్ చేసిన యురేనస్ ప్లూటో చిత్రాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రీట్వీట్ చేసి దానిపై కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ఆ ట్వీట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలో ఆలోచించే బదులు యురేనస్, ప్లూటో చిత్రాలను షేర్ చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. జూలై 12 మంగళవారం నాడు నిర్మలా సీతారామన్ ఈ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. మే నెలలో ఐఐపీ 19.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఏప్రిల్లో ఇది 7.1 శాతం స్థాయిలో ఉంది. అదేవిధంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కొంత నియంత్రణ ఉన్నప్పటికీ, మే మాసంతో పోల్చితే ద్రవ్యోల్బణం జూన్ నెలలో, 7.04 నుండి 7.01 శాతానికి తగ్గింది. క్షీణత స్వల్పంగా ఉన్నప్పటికీ, అది పెరగకపోవడం విశేషం.అయితే, ఇది ఇప్పటికీ ఆర్బీఐ సాధారణ స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.
పారిశ్రామిక ఉత్పత్తి ఎందుకు పెరిగింది?
ఎన్ఎస్ఓ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణం తయారీ, మైనింగ్ మరియు విద్యుత్ రంగాల మంచి పనితీరు కారణంగా చెప్పవచ్చు. మే నెలలో తయారీ రంగం 20.6 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, మైనింగ్ 10.9 శాతం, విద్యుత్ ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. అంటే ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగాయి. కానీ ఈ సారి ఐఐపిని మే 2021 నుండి పోల్చినట్లయితే, 2021తో పోలిస్తే 2022లో ఐఐపిలో తక్కువ పెరుగుదల కనిపించింది. తక్కువ బేస్ కారణంగా IIP మే 2021లో 27.6 శాతం పెరిగింది.
ద్రవ్యోల్బణం గణాంకాలు ఏం చెబుతున్నాయి
ద్రవ్యోల్బణం విషయానికొస్తే, పెద్దగా ఉపశమనం లభించలేదు. అయితే ఈసారి అది పెరగకపోవడం విశేషం. మే స్థాయి నుండి కొద్దిగా తగ్గింది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది. కాగా మే నెలలో ఇది 7.04 శాతం స్థాయిలో ఉంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జూన్లో గ్రామీణ ప్రాంతాల్లో 7.09 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో 6.92 శాతంగా ఉంది. పెట్రోలు-డీజిల్, కూరగాయలు, వంటనూనెలు, సుగంధ ద్రవ్యాల అధిక ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెద్దగా తగ్గలేదు. ఈ క్రమంలో కోడిగుడ్లు, పప్పుల ధరలు తగ్గుముఖం పట్టాయి.
