NSE Scam రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ స్కాంలో ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న చిత్ర రామకృష్ణ, ఆనంద్ సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేయగా, సీబీఐ దర్యాప్తులో హిమాలయ అదృశ్య యోగి పేరిట ఆనంద్ సుబ్రహ్మణ్యమే ఈ-మెయిల్ ఐడీని సృష్టించినట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
NSE Scam: ఎన్ఎస్ఈ స్కామ్లో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ దానికి సంబంధించిన అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ 'అజ్ఞాత యోగి' (Himalaya Yogi)తో మాట్లాడేందుకు ఉపయోగించిన ఈ-మెయిల్ ఐడీని నిందితుడు సంస్థ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యం సృష్టించినట్లు సీబీఐ శుక్రవారం పేర్కొంది. .
అయితే ఎన్ఎస్ఈ స్కామ్లో 'అదృశ్య యోగి' కోణం మార్కెట్ వర్గాలతో పాటు, విచారణ ఏజెన్సీలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. NSE ఫోరెన్సిక్ ఆడిట్ సైతం, ఆనంద్ సుబ్రమణ్యంనే 'అజ్ఞాత హిమాలయ యోగి'గా ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తన తుది నివేదికలో ఆనంద్ సుబ్రమణియనే 'యోగి' అనే వాదనను ఖండించింది. అయితే సీబీఐ కూడా తన ప్రాథమిక విచారణలో ఆనంద్ సుబ్రమణ్యమే అసలైన 'అజ్ఞాత యోగి' అనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.
సీషెల్స్కు వెళ్లి దర్యాప్తు చేయనున్న సీబీఐ..
ఈ కేసులో ఆనంద్ సుబ్రమణ్యం, చిత్రా రామకృష్ణ సీషెల్స్ పర్యటనపై కూడా సీబీఐ ఇప్పుడు విచారణ జరుపుతోంది. సీషెల్స్ ట్యాక్స్ హెవెన్ దేశంగా పరిగణిస్తుంటారు. చిత్రా రామకృష్ణ, 'హిమాలయ యోగి' మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణలో వారు సీషెల్స్కు వెళ్లినట్లు రిఫరెన్స్లు దొరికాయి.
ఇది కాకుండా 'అజ్ఞాత యోగి' పేరిట 'rigyajursama@outlook.com' అనే ఈ-మెయిల్ ఐడీని ఆనంద్ సుబ్రమణ్యం సృష్టించి కేవలం తాను మాత్రమే చిత్రా రామకృష్ణతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించారా, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉపయోగించారు అనే దానిపై కూడా సీబీఐ ఇప్పుడు విచారణ జరుపుతోంది. ఎన్ఎస్ఈకి సంబంధించిన కో-లొకేషన్ స్కామ్లో ఇప్పటికే ఆనంద్ సుబ్రమణ్యం, చిత్రా రామకృష్ణలను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఎన్ఎస్ఇ స్కామ్కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబి ఫిబ్రవరి 7న జారీ చేసిన ఆర్డర్లో, అప్పటి ఎన్ఎస్ఇ సిఇఒ మరియు ఎండి చిత్రా రామకృష్ణ ఎవరో తెలియని యోగి ఆదేశాల మేరకు అన్ని నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొంది. దర్యాప్తు సందర్భంగా, యోగి గురించి SEBI చిత్రను అడిగినప్పుడు, ఆమె ఆ యోగి హిమాలయాల్లో తిరుగుతున్న ఆధ్యాత్మిక శక్తి అని పేర్కొన్నారు. యోగికి సొంత శరీరం లేదని, ఆయన కోరుకున్న చోట కనిపించేవారని చిత్ర పేర్కొంది.