రూపీపై ప్రధాని మోదీ ఫోకస్: త్వరలో ఆర్థిక స్థితిపై సమీక్ష
రూపాయి పతనంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ కరుణించారు. జీడీపీ పెరుగుతున్నా డాలర్పై రూపాయి 13 శాతానికి పైగా పతనం కావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. బుధవారం రికార్డు స్థాయిలో రూపాయి 72.91 స్థాయి జీవితకాల కనిష్టానికి పడిపోయిన తర్వాత అనవసర పతనానికి ఇక ఆస్కారం ఇవ్వబోమని ఆర్థికశాఖ ప్రకటించాకే రూపాయి కోలుకోవడం గమనార్హం.
అమెరికా డాలర్పై రూపాయి విలువ భారీగా పతనమైన తర్వాత కేంద్రం కళ్లు తెరిచింది. ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీరియస్ గా ద్రుష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ వారాంతంలోగా రూపాయి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారని తెలుస్తున్నది.
రూపాయి ‘అసాధారణ స్థాయి’లకు పడిపోదని భరోసా ఇచ్చేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. దీనికి బుధవారం రూపాయి పుంజుకోవడమే ఇందుకు కారణమని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు.
ఆపరేటర్ల అత్యుత్సాహం వల్లే రూపాయి ఇలా పతనంమంగళవారం వరకు మార్కెట్ పతనానికి ప్రధాన కారణమేదీ లేదని, మార్కెట్ ఆపరేటర్ల అత్యుత్సాహమే ఈ పరిస్థితికి దారి తీసింది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు.
రూపాయి క్షీణత, చమురు ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైనా వారాంతంలోగా జరిగే సమీక్షలో విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని మోదీ నిర్వహించే సమీక్షా సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, పీఎంఈఏసీ ఛైర్మన్ వివేక్ దేవ్రాయ్ తదితరులు సమావేశానికి హాజరుకావొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
హమ్మయ్య!కోలుకున్న రూపాయి!!
వరుస పతనం నుంచి రూపాయి కోలుకుంది. రూపాయి క్షీణత నియంత్రణకు ఆర్బీఐ, ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతాయంటూ ఆర్థిక శాఖ భరోసా కల్పించడం ఇందుకు కారణమైంది. దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించనున్నారన్న వార్తలు కూడా ఇందుకు ఉపకరించాయి.
బుధవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక ఒకానొక దశలో రూపాయి మారకపు 72.91 వరకు పతనమైంది. ఇది తాజా జీవన కాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆ తర్వాత అమాంతం 105 పైసలు పెరిగి 71.86 వరకు వెళ్లింది. చివరకు 51 పైసలు లాభపడి 72.18 వద్ద ముగిసింది. మే 25 తర్వాత ఒక రోజులో రూపాయి అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి.
జీడీపీ పెరిగినా రూపాయి పతనం ఆందోళనకరం
భారీగా జీడీపీ వ్రుద్ధిరేటు నమోదవుతున్నా డాలర్ పై రూపాయి విలువ భారీ పతనం కావడం ఆర్థికవేత్తలను కలవరపెడుతోంది. ఈ ఏడాదిలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా 13.81 శాతం పతనమైన కరెన్సీ రూపాయి అంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల ముడి చమురు ధరలు పెరగడంతోపాటు కరంట్ ఖాతా లోటు, వాణిజ్య లోటు విస్త్రుతి పెరుగుతుందన్న ఆంఅదోళనలు వ్యక్తం అయ్యాయి. దిగుమతులపై చెల్లింపుల సమస్య వెంటాడుతుంది.