నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్పై ఈడీ ఆడిట్.. కష్టాల్లో నరేశ్ గోయల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కష్టాల్లో చిక్కుకున్నారు. బ్యాంకర్ల దగ్గర తీసుకున్న రుణాలను ఇతర సంస్థలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి
జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థలో నిధుల దారి మళ్లింపుపై ఈడీ కేంద్రీకరించిన సంగతి తెలిసిందే.
ఎస్బీఐ జరిపిన ఆడిట్పై సంతృప్తి చెందని అధికారులు స్వతంత్ర ఆడిట్ చేయిస్తామని ప్రకటించడంతో నరేష్గోయల్ చిక్కుల్లోపడ్డారు. నరేష్గోయల్కు మొత్తం 19 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరయ్యాయని సీనియర్ ఈడీ అధికారులు చెప్పారు.
నరేశ్ గోయల్కు చెందిన సంస్థలు అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో జరిపిన అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, రూ.7000 కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిదని భావిస్తోంది.
గతవారంలో గోయల్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఎస్బీఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది.
ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టు నెలలో ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత తొలిసారి ముంబైలో గోయల్ను ప్రశ్నించింది.
ఆయనతోపాటు జెట్ ఎయిర్వేస్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపైనా ఈడీ దాడి చేసి సోదా చేసింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు.
కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్ లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.