తూత్తుకూడిలో ‘ఇస్రో’ కొత్త కేంద్రం: ప్రైవేట్ పెట్టుబడులకూ గ్రీన్ సిగ్నల్
శ్రీహరి కోట తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెండో ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది. తమిళనాడులోని తూత్తుకూడి వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. రెండో ప్రయోగ కేంద్రం ఏర్పాటైతే ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
దేశీయ అంతరిక్ష రంగంపై స్టార్టప్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ తెలిపారు. పెద్ద సంస్థలు ఇందులోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇస్రో రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం భూ సేకరణ ప్రక్రియ గురించి మీడియాతో శివన్ ఈ సంగతిని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని అంతరిక్ష పరిశోధన సంస్థలకు ఒకటికంటే ఎక్కువ రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. ఇస్రోకు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో మాత్రమే రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. ఇందులో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం తమిళనాడు తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భూ సేకరణ జరుగుతున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ఇందుకు 2,300 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. భూ సేకరణ పనులు పూర్తవ్వగానే ఇతర పనులు ప్రారంభిస్తామన్నారు.
also read బంగారం ధర మళ్ళీ పెరిగింది..10గ్రా ఎంతంటే..? ...
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతినిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాకెట్లు-ఉపగ్రహాల తయారీ, ఇతర సర్వీసుల్లో ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంపై స్టార్టప్ సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు శివన్ చెప్పారు.
ప్రపంచ అంతరిక్ష రంగం మార్కెట్ విలువ 352 బిలియన్ డాలర్లుగా ఉంది.. అందులో భారత్ వాటా మూడు శాతమేనని శివన్ వెల్లడించారు. అయితే ఇస్రో ఒంటిరిగా ఉంటే.. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత భాగస్వామ్యం పెంచుకోవడం కుదరదన్నారు. అందుకే ప్రైవేట్ సంస్థల నుంచి పెట్టుబడులు అహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
350 బిలియన్ డాలర్ల అంతరిక్ష రంగం వాటాలో.. రాకెట్ ప్రయోగ సేవల వాటా 2 శాతం, ఉపగ్రహాల తయారీ వాటా 5 శాతం, స్పేస్ అప్లికేషన్స్ సర్వీసుల వాటా 45 శాతం, గ్రౌండ్ ఎక్విప్మెంట్ వాటా 48 శాతం ఉన్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వివరించారు.