Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాటు: ఏవియేషన్‌పై పోటు.. వేతనాలపై వేటు

కరోనా మహమ్మారి వల్ల విమానయాన రంగం రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలను కబళించిన ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుండటంతో దాదాపు అన్ని దేశాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతుండటంతో  విమానయాన సంస్థలు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు కొన్ని విమానయాన సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు, భత్యాల్లో కోత విధిస్తుంటే.. మరికొన్ని సంస్థలు సిబ్బందికి వేతన రహిత సెలవులు ఇస్తున్నాయి.
 

Indian carriers brace for coronavirus impact: IndiGo, Air India, GoAir announce salary cuts
Author
Hyderabad, First Published Mar 20, 2020, 2:26 PM IST

ముంబై: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని కీలకరంగాలతోపాటు విమానయాన రంగాన్ని దారుణంగా కుంగదీస్తున్నది. దీని ప్రభావంతో సతమతమవుతున్న దేశీయ విమాన యాన సంస్థలు తమ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. 

మార్కెట్‌ వాటాపరంగా దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. వ్యక్తిగతంగా తన జీతంలో 25 శాతం కోత విధించుకొంటున్నట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సీఈవో రోనో దత్తా గురువారం తమ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. 

also read మరింత బలహీనపడిన రూపాయి...అంతా కరోనా వైరస్ వల్లే

సీనియర్‌ వైస్‌ప్రెసిడెండ్‌, అంతకంటే పైస్థాయి అధికారుల వేతనాల్లో 20 శాతం, వైస్‌ప్రెసిడెండ్‌, కాక్‌పిట్‌ సిబ్బంది వేతనాల్లో 15 శాతం, బ్యాండ్‌ డీ సిబ్బందితోపాటు క్యాబిన్‌ సిబ్బంది వేతనాల్లో 10 శాతం, బ్యాండ్‌ సీ సిబ్బంది వేతనాల్లో ఐదు శాతం కోత విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే వారి కుటుంబాలకు ఎంత ఇబ్బందికరమో తమకు తెలుసని, కానీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి సంస్థ ముందుకు సాగాలంటే మనమంతా కొన్ని త్యాగాలు చేయక తప్పదని రోనో దత్తా ఆ లేఖలో స్పష్టం చేశారు. బ్యాండ్‌ ఏ, బ్యాండ్‌ బీ సిబ్బందికి మినహా ఉద్యోగులందరికీ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వేతన కోతలు అమలవుతాయన్నారు.

‘కరోనా వైరస్‌ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా ఉండటం భయాందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు ట్రావెల్‌ అడ్వైజరీలు జారీచేయడంతో మన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం డొమెస్టిక్‌ బుకింగ్స్‌ కూడా 20 శాతం మేరకు తగ్గాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియడంలేదు’ అని రోనో దత్తా తెలిపారు.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా కూడా ‘ఇండిగో’ బాటలోనే నడుస్తున్నది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న ఎయిర్‌ ఇండియాపై కరోనా ప్రభావం ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’ చందంలా మారింది.

దీంతో ఎయిర్‌ ఇండియా కూడా తమ ఉద్యోగుల వేతనాల్లో స్వల్పంగా కోత విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కోత 5 శాతం మేరకు ఉండవచ్చని ఎయిర్‌ ఇండియా వర్గాలు చెప్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు పదేపదే విఫలమవుతున్న విషయం తెలిసిందే.

ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు దాదాపు రెండేండ్ల నుంచి సింగిల్‌ బయ్యర్‌ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఇప్పటికే తమ క్యాబిన్‌ సిబ్బందికి ఫ్లయింగ్‌ అలవెన్సులను తగ్గించడంతోపాటు పైలెట్లు, ఇతర సిబ్బందికి వినోద (ఎంటర్‌టైన్‌మెంట్‌) అలవెన్సును ఉపసంహరించింది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా, కెనడా తదితర దేశాలకు ఎయిర్‌ ఇండియా అంతర్జాతీయ సర్వీసులన్నీ దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో తమ ఉద్యోగుల వేతనాల్లో ఐదు శాతం కోత విధించాలని యోచిస్తున్నట్టు ఓ అధికారి పీటీఐకి తెలిపారు. 

also read యెస్ బ్యాంకుకు ఆర్బీఐ అండ: మరో రూ.60 వేల కోట్ల లోన్!

మరోవైపు కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకు ‘గోఎయిర్‌' సంస్థ కూడా తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తమ ఉద్యోగులకు స్వల్పకాలంపాటు వేతనరహిత సెలవు ఇవ్వనున్నట్టు ‘గోఎయిర్‌' ప్రకటించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్య పరిస్థితి నెలకొనడంతో ‘స్పైస్‌జెట్‌' విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ అనూహ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శనివారం నుంచి ఏప్రిల్‌ 30 వరకు తమ అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ‘స్పైస్‌జెట్‌' గురువారం ప్రకటించింది.

పరిస్థితులు సాధారణస్థాయికి చేరుకున్నాక సాధ్యమైనంత త్వరగా ఆ సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపింది. అయితే కోల్‌కతా-ఢాకా సర్వీస్ షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తుందని, చెన్నై-కొలంబో సర్వీస్ ఈ నెల 25 నుంచి, ఢిల్లీ-దుబాయ్‌, ముంబై-దుబాయ్‌ సర్వీసులు ఏప్రిల్‌ 16 నుంచి పునఃప్రారంభమవుతాయని ‘స్పైస్‌జెట్‌' అధికార ప్రతినిధి వివరించారు. భారత్‌ సహా పలు దేశాలపై కరోనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే తమ సర్వీసులను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios