‘చైనా’పై వేటు వేటేయాల్సిందే.. 500 వస్తువులకు పైగా బహిష్కరణ...
తూర్పు లడఖ్ వద్ద సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని అఖిల భారత వ్యాపారుల సంఘం (కెయిట్) పిలుపునిచ్చింది. ఈ మేరకు 500లకుపైగా వస్తువులను బహిష్కరించింది. దేశీయ సంస్థలకు అండగా ఉండాలని పిలుపునిచ్చింది. డ్రాగన్ పెట్టుబడులను అడ్డుకోవాలని కేంద్రానికి సూచించింది.
ముంబై: చైనాతో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న 500లకుపైగా వస్తువులను అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) బహిష్కరించింది. ఇందులో ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆట వస్తువులు, ఫర్నీషింగ్ ఫ్యాబ్రిక్స్, టెక్స్టైల్స్, బిల్డర్ హార్డ్వేర్, పాదరక్షలు, దుస్తులు, వంట సామాగ్రి తదితర ఉత్పత్తులు ఉన్నాయి.
‘వచ్చే ఏడాది ఆఖరుకల్లా చైనా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న వస్తువులను దాదాపు రూ. లక్ష కోట్ల మేరకు తగ్గించుకోవడమే మా లక్ష్యం’ అని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఓ ప్రముఖ జాతీయ వాణిజ్య దినపత్రికతో అన్నారు. అలాగే ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ను రద్దు చేసి చైనా కంపెనీకి బదులు భారత కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
పేటీఎం, బిగ్బాస్కెట్ తదితర భారతీయ స్టార్టప్ల్లో చైనా పెట్టుబడులపై ఓ కన్నేయాలని కూడా కేంద్రాన్ని కోరామని ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇటీవల పెట్టిన పెట్టుబడులనూ ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు ఖండేల్వాల్ తెలిపారు. ఈ పెట్టుబడులను అడ్డుకోవాలన్నారు.
చైనా నుంచి భారత్లోకి కుప్పలు తెప్పలుగా రకరకాల వస్తు ఉత్పత్తులు వచ్చిపడుతున్నాయి. అయితే వీటిలో కొన్నింటికి భారత్లో ప్రత్యామ్నాయ వస్తువులుండగా, మరికొన్నింటికి చైనావే దిక్కు.
ఈ క్రమంలో 3 వేల వస్తువుల దిగుమతులను ఆపవచ్చని, భారతీయ వస్తువులు వీటికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. సదరు వస్తువులు భారత్లోనూ లభిస్తున్నాయని, కాబట్టి ఆయా ఉత్పత్తులను చైనా నుంచి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
also read ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్..వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే...
దేశవ్యాప్తంగా 40 వేల వర్తక సంఘాలు, 7 కోట్ల వర్తకులకు సీఏఐటీ ప్రాతినిథ్యం వహిస్తున్నది. భారతీయ వాణిజ్య లోటులో 40 శాతానికిపైగా చైనాతోనే ఉన్నది. గతేడాది చైనా నుంచి భారత్కు దిగుమతులు 50 బిలియన్ డాలర్లు పెరిగితే.. ఆ దేశానికి భారతీయ ఎగుమతులు మాత్రం 2.5 బిలియన్ డాలర్లే పెరిగాయి.
చైనా ఉత్పత్తులకు మద్దతుగా ప్రచారం చేయవద్దని భారత సినీ ప్రముఖులకు సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ‘చైనాతో పోరాటానికి సరిహద్దులదాకా వెళ్లాలని మేం మీకు చెప్పడం లేదు. చైనా వస్తు ఉత్పత్తులను బహిష్కరించి సైన్యం, మాతృభూమికి అండగా ఉండాలని కోరుతున్నాం’ అని ఖండేల్వాల్ అన్నారు.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం మూడు చైనా సంస్థలతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకున్నది. వివిధ దేశాలకు చెందిన 12 కంపెనీలతో మహారాష్ట్ర రూ.16 వేల కోట్ల విలువైన ఎంవోయూలను చేసుకోగా, అందులో చైనాకు చెందిన మూడు కంపెనీలతో రూ.5 వేల కోట్లకుపైగా విలువైన ఎంవోయూలూ ఉన్నాయి. సోమవారం ఈ ఒప్పందాలు కుదిరాయి.
హెంగ్లీ ఇంజినీరింగ్, ఫోటాన్-పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటి సొల్యూషన్స్ జాయింట్ వెంచర్, గ్రేట్ వాల్ మోటర్స్ సంస్థలు పుణెలోని తాలేగావ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ, 20 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
చైనా ఉత్పత్తుల బహిష్కరణ నినాదాన్ని భారతీయ ఆటో రంగ దిగ్గజాలు మారుతి సుజుకీ, బజాజ్ వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో వాహన ఉత్పత్తికి చైనా విడిభాగాలు చాలా అవసరమని ఈ సంస్థలు వాదిస్తున్నాయి. చైనా నుంచి సదరు ఉత్పత్తుల రాక నిలిచిపోతే, దాని ప్రభావం వాహన వినియోగదారులపై పడుతుందంటున్నాయి. వాహన తయారీదారుల కంటే ఆటో విడిభాగాల అమ్మకందారులే ఎక్కువగా ప్రభావితులవుతారని మారుతి సుజుకీ ఓ జాతీయ వార్తా చానెల్తో వ్యాఖ్యానించింది.