అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ సిద్దంచేసిన భారత్...కానీ మరో నెల సమయం
అమెరికాపై ప్రతీకారం పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయించిన భారత్.. దాని అమలును మరోసారి వాయిదా వేసింది. వచ్చేనెల రెండో తేదీ వరకు వేచి ఉండాలని నిర్ణయించింది.
ముంబై: అమెరికా ఉత్పత్తులపై పన్ను విధించే విషయమై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చేనెల రెండో తేదీ వరకు వేచి చూడాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. దీంతో 29 రకాల అమెరికా వస్తువులకు మరికొంత కాలం ఉపశమనం లభించనున్నది. వాస్తవానికి కొత్త టారీఫ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కావాలి.
ఇప్పటికే జూన్ 2018 నుంచి దాదాపు డజను సార్లు ఈ మినహాయింపును పొడిగించుకుంటూ వచ్చింది. అమెరికా విధించిన పన్నులకు ప్రతిగా భారత్ కూడా పన్నులు విధించాలని నిర్ణయించింది. కానీ, భారత్ ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా వేచి చూసే ధోరణి కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత అధికారులు కూడా అమెరికా అధికారులతో చర్చిస్తున్నారు. అదే సమయంలో గత నెల భారత్కు జీఎస్పీ హోదాను రద్దు చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్నది. దీంతో భారత్ నుంచి అమెరికా వెళ్లే దాదాపు 5.6బిలియన్ డాలర్ల సరుకులపై ప్రభావం పడనున్నది.
దాదాపు 1,900 వస్తువులు దీని పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా కెమికల్, ఇంజినీరింగ్ రంగాలు ప్రభావితం కానున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో భారత అధికారుల బృందం అమెరికా వెళ్లి చర్చలు జరపనుంది.
ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా పన్నులు విధించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. భారత మార్కెట్లోకి అమెరికా చొచ్చుకొచ్చేలా నిబంధనలు ఉండాలని అమెరికా కోరుకుంటోంది. వ్యవసాయరంగం, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్స్ వస్తువలపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటోంది.
భారత్ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధిక పన్నులను విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిగా అమెరికా వస్తువులపై టారిఫ్ పెంచాలని గతేడాది జూన్ నెలలోనే నిర్ణయించింది. ఆల్మండ్స్, వాల్నట్స్, యాపిల్స్పైనా పన్ను విధించాలని ఆగస్టు నాలుగో తేదీ నుంచి అమలు చేయాలని భారత్ నిర్ణయించింది. గత నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ భారతదేశానికి తాము ఇస్తున్న ప్రిఫరెన్షియల్ స్టేట్ హోదాను తొలగిస్తామని ప్రకటించారు.