వృద్ధి రేటు మైనస్కి పడిపోతున్నా.. టాప్-5లోకి ఇండియా
కరోనాతో జీడీపీ మైనస్ కి పడిపోతున్నా దేశీయ ఫారెక్స్ నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా చేరుకున్నాయి. దీంతో దేశీయ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
ముంబై: కొవిడ్-19తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గడచిన నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు మైనస్కి పడిపోయింది. అయినా భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు గలగలలాడుతోంది. గత నెల 26వ తేదీతో ముగిసిన వారాంతానికి భారత ఫారెక్స్ నిల్వలు 127 కోట్ల డాలర్లు పెరిగి 50,684 కోట్ల డాలర్లకు చేరాయి.
ప్రస్తుత జీడీపీలో ఈ నిల్వలు దాదాపు 20 శాతానికి సమానం. ప్రస్తుత మారకం రేటు ప్రకారం చూస్తే భారత ఫారెక్స్ నిల్వలు రూ.38.01 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దాదాపు 13 నెలల దిగుమతులకు సరిపోతాయి.
అంతే కాక అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న టాప్ 5 దేశాల్లో భారత్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నది. భారత్ కంటే ముందు స్థానాల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్, రష్యా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. కాగా గత 3 నెలల్లో దాదాపు 2,500 కోట్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు భారత ఖజానాలో చేరటం విశేషం.
also read అల్ టైం హై నుంచి దిగోచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ? ...
ఫారెక్స్ నిల్వలు ఎక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లకు కళ్లెం వేసే అవకాశం ఉంటుంది. స్పల్ప, మధ్యకాలిక విదేశీ రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితులు క్షీణించినా, దిగుమతుల చెల్లింపులకు ఢోకా ఉండదని విశ్లేషకులు తెలిపారు. ఇవి దేశీయ జీడీపీలో 20 శాతం.
మే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ఎఫ్పీఐల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. రిలయన్స్తో సహా వివిధ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దిగుమతులు మందగించి కరెంట్ ఖాతాలో మిగులు ఏర్పడింది.
ప్రవాస భారతీయుల (ఎన్నారై) నుంచి నిధుల ప్రవాహం పెరిగింది. దీనికితోడు చమురు ధరల పతనం కావడంతోపాటు బంగారం దిగుమతులు క్షీణించడం కూడా ఫారెక్స్ నిల్వలు పెరిగిపోవడానికి కారణం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ (ఫారెక్స్) నిల్వలు 500 బిలియన్ల డాలర్లకు పైగా పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువకు పడిపోవడంతో దేశ వాణిజ్య లోటు 13 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.