కరోనా కాలంలో కాసుల వర్షం: 4 నెలల్లో 25% పెరిగిన అతని సంపద!
కరోనా కష్టకాలంలో అందరు అష్టకష్టాల పాలవుతుంటే, బిలియనీర్ల సంపద మాత్రం పెరిగిపోయింది. అందులో సీరం ఇన్ స్టిట్యూట్ సీఎండీ పూనావాలా సంపద నాలుగు నెలల్లో 25 శతం పెరిగింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 86వ స్థానానికి సైరస్ పూనావాలా చేరుకున్నారు.
ముంబై: కరోనా దెబ్బకు వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కార్పొరేట్ ప్రముఖుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. వ్యాక్సిన్ కింగ్గా పేరు ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలాకు మాత్రం బాగా కలిసివచ్చింది.
కరోనా కష్టకాలంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఎండీ అయిన పూనావాలా ఆస్తి.. గత నెలాఖరుతో ముగిసిన నాలుగు నెలల్లో 25 శాతం పెరిగిందని హరున్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. హురున్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 86వ స్థానానికి ఎగబాకారు.
ఫిబ్రవరిలో విడుదల చేసిన ‘గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020’తో పోలిస్తే 4 నెలల్లో పూనావాలా ర్యాంకింగ్ ఏకంగా 57 స్థానాలు మెరుగుపడిందని హరున్ తెలిపింది. పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ.
వ్యాక్సిన్ల తయారీ, సరఫరా సామర్థ్యం సంపద పెరుగుదలకు దోహదపడిందని హరున్ పేర్కొంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల ఉత్పత్తి కోసం ఈ మధ్యే ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఇప్పటికీ రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీదే అగ్రస్థానం. కరోనా దెబ్బకు శరవేగంగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆస్తి.. మళ్లీ అంతే వేగంతో పెరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రిలయన్స్ షేర్ భారీగా పతనం అయింది.
also read హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్ ...
తత్ఫలితంగా ముకేశ్ అంబానీ ఆస్తి కూడా భారీగానే ఆవిరైంది. అయితే, జియో ప్లాట్ఫామ్స్లోకి గ్లోబల్ దిగ్గజాల పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ రిలయన్స్ సంస్థకు బాగా కలిసివచ్చింది. దాంతో అంబానీ సంపద నేలను తాకిన బంతిలా రివ్వున ఎగిసింది. ఏప్రిల్, మే నెలల్లో 1,800 కోట్ల డాలర్ల మేర పుంజుకుంది.
ఈ కష్టకాలంలో అంబానీ నెట్వర్త్ ‘వీ’ (ఆంగ్ల అక్షరం) షేప్ రికవరీని చూసిందని హరున్ పేర్కొంది. అయితే, మే చివరి నాటికి ముకేశ్ ఆస్తి.. ప్రీ-కొవిడ్ స్థాయితో పోలిస్తే 1 శాతం తక్కువే. అయినప్పటికీ హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఆయన 8వ స్థానానికి ఎగబాకారు. 4నెలల క్రితంతో పోలిస్తే మెట్టు పైకెక్కారు.
ప్రపంచ టాప్-10 కుబేరుల్లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముకేశ్ అంబానీ. టాప్-100లోని ఇతర భారతీయ ధనవంతులతో పోలిస్తే అంబానీ ఆస్తి తరుగుదల చాలా తక్కువగానే ఉంది. హరున్ గ్లోబల్ టాప్-100 రిచ్ లిస్ట్లో నలుగురు భారతీయులకు (ముకేశ్ అంబానీ, సైరస్ పూనా వాలా, గౌతమ్ అదానీ, శివ్ నాడార్) చోటు దక్కింది
హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడార్ సంపద ఆరు శాతం మేర తగ్గిపోయింది. అంటే 1,600 కోట్ల డాలర్లకు పడిపోయింది. దాంతో ఆయన గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఆయన 72వ స్థానానికి పడిపోయారు. నాలుగు నెలల క్రితంతో పోలిస్తే ర్యాంకింగ్ నాలుగు స్థానాలు దిగజారింది.
అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సంపద 18 శాతం క్షీణించి 1,400 డాలర్లకు పడిపోయింది. రిచ్ లిస్ట్ ర్యాంకింగ్లో 27 స్థానాలు జారి 95వ స్థానానికి పరిమితమయ్యారు. అంతా ఊహించినట్లే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా మూడోసారి అగ్రస్థానంలో కొనసాగారు.