మీరు సొంతింటి కోసం రుణం తీసుకుంటున్నారా.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) 10 బేసిక్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) పెంచేసింది. హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తాజాగా ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది.
హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు బ్యాడ్న్యూస్ చెప్పింది. తన బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ రేటు పెంచడం వల్ల ప్రస్తుత రుణ గ్రహీతలకు ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), బ్యాంకు ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచాయి. ఇతర లెండార్ల రేట్ల పెంపుకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ కూడా తన లెండింగ్ రేట్లను పెంచింది.
‘‘హౌసింగ్ లోన్లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఆర్పీఎల్ఆర్)ను హెచ్డీఎఫ్సీ పెంచింది. దీంతో బెంచ్మార్కు చేయబడ్డ దాని అడ్జెస్టబుల్ రేటు హోమ్ లోన్లు(ఏఆర్హెచ్ఎల్) 5 బేసిస్ పాయింట్లు పెరిగాయి. మే 1, 2022 నుంచి పెంచిన ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి’’ అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. దీంతో 750 పైన క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ అడ్జెస్టబుల్ రేటు అంతకుముందు 6.70 శాతం ఉంటే.. ప్రస్తుతం 6.75 శాతానికి పెరిగింది. అయితే కొత్త రుణ గ్రహీతలకు మాత్రం లెండింగ్ రేట్లను మార్చలేదు. కొత్త రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు వారు తీసుకునే క్రెడిట్, లోన్ మొత్తం బట్టి 6.70 శాతం నుంచి 7.15 శాతం మధ్యలోనే ఉండనున్నాయి.
రూ.30 లక్షల వరకు రుణాలన్న కస్టమర్లకు 6.85 శాతం వడ్డీ రేట్లను ఛార్జ్ చేయనుంది. అలాగే రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్యలో లోన్లకు 7.10 శాతం, రూ.75 లక్షల పైన రుణం ఉన్న వారికి 7.20 శాతం వడ్డీ రేట్లను విధించనుంది. అన్ని సెగ్మెంట్లలో మహిళా కస్టమర్లకు వడ్డీ రేట్లు 5 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పెరుగుతోన్న ద్రవ్యోల్బణ భయాలతో వచ్చే నెలల్లో వడ్డీ రేట్లు భారంగా మారబోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఎగిసి ఎగిసి పడుతోంది. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ను మించి ఈ ద్రవ్యోల్బణం ఎగిసింది.
ఎస్బీఐ గత నెల 15వ తేదీ నుండి 10 పాయింట్ల ఎంసీఎల్ఆర్, యాక్సిస్ బ్యాంకు ఐదు బేసిస్ పాయింట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఐదు బేసిస్ పాయింట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు బేసిస్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు ఏప్రిల్ 12వ తేదీ నుండి, కొటక్ మహీంద్రా వడ్డీ రేట్లు ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఇటీవలి వరకు వడ్డీ రేట్లు ఆల్ టైమ్ కనిష్టం 6.5 శాతం వద్ద కూడా కనిపించాయి. ఆర్థిక రికవరీ నేపథ్యంలో వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
