మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కరోనా కేసులే కారణం ?
ఎంసీఎక్స్లో ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.49013 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు 8.8 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
న్యూ ఢీల్లీ: భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా ఆందోళన చెందుతున్న నేపధ్యంలో సోమవారం ఉదయం వాణిజ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి, పెట్టుబడిదారులు ప్రమాదకర ఆస్తుల నుండి, సురక్షితమైన మార్గాల వైపు మొగ్గు చూపారు.
ఎంసీఎక్స్లో ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.49013 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు 8.8 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యధికం, సుమారు 23,100 మందికి పైగా ఈ వైరస్ సోకి మరణించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అనేక రాష్ట్రాలు వ్యాపారాలపై ఆంక్షలను పెంచాయి. గోల్డ్ ఫ్యూచర్స్ లో బంగారం ధర 0.36 శాతం/ రూ .177 పెరిగి 10 గ్రాములకి 49,040 రూపాయలు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ లో వెండి ధర 1.20 శాతం /618 రూపాయలు పెరిగి కిలోకు 51,980 రూపాయలకు చేరుకుంది.
also read ఐఆర్సీటీసీ ఆర్థిక ఫలితాల జోరు.. 80శాతం పెరిగిన నికరలాభం.. ...
గతవారంలో బంగారం ధర రూ.49,348 వద్ద కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు శుక్రవారం 10 గ్రాములకు స్వల్పంగా పెరిగి 49,959 రూపాయలకు చేరుకున్నాయి. వెండి కిలోకు రూ.352 తగ్గి రూ .52,364 కు చేరుకుంది.
స్పాట్ బంగారం 0303 జిఎంటి నాటికి 0.3 శాతం పెరిగి ఔన్స్కు 1,803.80 డాలర్లకు చేరుకుంది. అమెరికా బంగారు ఫ్యూచర్స్ లో 0.4 శాతం పెరిగి 1,809.10 డాలర్లకు చేరుకున్నాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఉపయోగిస్తారు.
పల్లాడియం 0.9 శాతం పెరిగి ఔన్స్కు 1,987.77 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 2.4 శాతం పెరిగి 834.05 డాలర్లకు, వెండి 1 శాతం పెరిగి 18.86 డాలర్లకు చేరుకుంది.