విమాన యాన సంస్థలు ఒకవైపు పెట్రోల్ ధరలు ఎక్కువయ్యాయని చెబుతూ ఆచరణలో ఆ బారాన్ని ప్రజలపై మోపుతున్నాయి. పెరిగిన ఎయిర్ ఫ్యూయల్ ధరలతో విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలు పెంచుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు రకరకాల ఆఫర్లు అందిస్తున్నాయి.  

బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఎయిర్‌ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించించింది. అన్ని చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్‌ చేస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక‍్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్‌ చేయడం గమనార్హం.

మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది. 

వీడని జెట్ ఎయిర్వేస్ కష్టాలు 

జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ రద్దు చేసిన విమాన సర్వీసుల్లోని ప్రయాణికులను అనుమతించమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, ప్రైవేట్‌ రంగంలోని విస్తారా ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేశాయి.

సాధారణంగా విమాన సర్వీసులు రద్దయినప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకున్న విమానయాన సంస్థలు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇతర విమానయాన సంస్థల సర్వీసులను ఉపయోగించుకుంటాయి. 

నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు
జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం నిధుల కొరతతో పలు విమాన సర్వీసులను రద్దు చేయటంతో తాము ఈ వసతిని కల్పించలేమని ఎయిర్‌ ఇండియా తెలిపింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌, జెట్‌ లైట్‌ లిమిటెడ్‌లకు చెందిన ప్రయాణికులను తమ విమానాల్లో ప్రయాణాలకు అనుమతించేదీ లేదని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఎయిర్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.