Asianet News TeluguAsianet News Telugu

టాటాసన్స్ గ్రూపు సంచలన నిర్ణయం..ఫస్ట్ టైం మేనేజ్మెంట్ వేతనాల్లో కోత

కరోనా విశ్వమారి టాటా సన్స్ గ్రూపులో తొలిసారి సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. కంపెనీ సీఈవోలు, ఎండీల వేతనాల్లో 20శాతం కోత విధించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నది. వారు బోనస్‌లు కూడా వదులుకుంటారు.  

For the first time Tata Group top brass to take upto 20 pc pay cut
Author
Hyderabad, First Published May 26, 2020, 11:41 AM IST

ముంబై: కరోనా విశ్వమారి కల్పించిన సంక్షోభంతో తన చరిత్రలోనే టాటా సన్స్ గ్రూపు టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి కీలక నిర్ణయం తీసుకున్నది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తోపాటు టాటా గ్రూప్ కంపెనీల  సీఈఓలు వేతనంలో కోత విధించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

టాటా సన్స్ గ్రూప్ ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించిన నేపథ్యంలో 20 శాతం దాకా వేతన కోతకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ , లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం ప్రభావితం కావడంతో టాటా సన్స్ గ్రూప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 

తాజా నిర్ణయం ప్రకారం టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్  ఇతర  కంపెనీల సీఈవోలు, ఎండీలు వారి వారి జీతాలను తగ్గించు కుంటారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో టాటా సంస్థలకు వ్యాపారపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూసి కిందిస్థాయి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు వారు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి.  

అలాగే  ప్రస్తుత సంవత్సర బోనస్‌లను కూడా వదులుకోనున్నారు. ఈ  వరుసలో గ్రూప్ ప్రధానమైన, అత్యంత లాభదాయక సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ ముందు వరుసలో నిలిచారు. టాటా సన్స్ గ్రూప్ ప్రకటించిన సమాచారం ప్రకారం  గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో రాజేష్ రెమ్యునరేషన్ 16.5 శాతం తగ్గి రూ .13.3 కోట్లకు  చేరుకుంది. 

also read హోటళ్లు, రవాణా రంగంపై ‘కరోనా’ కాటు: 2 కోట్ల కొలువులు ఔట్... ...

తద్వారా సంస్థలకు, కీలక ఉద్యోగులకు ప్రేరణ ఇవ‍్వడంతోపాటు, నైతిక మద్దతు అందించాలని టాటా గ్రూప్ సంస్థల సీఈఓలు, ఎండీలు భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రేరిత సంక్షోభం సమయంలో పే-కట్ తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని టాటా సన్స్ వెల్లడించింది. 

కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2020 ఆర్థిక సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ వేతనాలు భారీగా క్షీణించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో టాప్-15 టాటా గ్రూప్ కంపెనీలలో సీఈవో వేతనం 2019-20లో సగటున 11 శాతం పెరిగింది. అంతకుముందు 2016-17 తో పోలిస్తే 2017-18 లో 14 శాతం పెరిగింది.

దాన ధర్మాల్లో ముందు ఉండే టాటా గ్రూప్ ఇంతకుముందు కరోనా కోసం సాయం చేసేందుకు ఏకంగా రూ.1500 కోట్ల విరాళం ప్రకటించింది. టాటా సన్స్ రూ.1000 కోట్ల విరాళం ప్రకటిస్తే.. టాటా ట్రస్ట్స్ రూ.500 కోట్ల విరాళం ఇచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 52 టాటా ట్రస్ట్ సంస్థలు వివిధ చారిటబుల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వేతనంలో 30 శాతం కోత!
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సీఈవో వి.వైద్యనాథన్ సహా బ్యాంకు సీనియర్ మేనేజ్‌మెంట్ వేతనంలో కోతలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సీనియర్ మేనేజ్‌మెంట్ తమ వేతనంలో 10 శాతం కోత విధించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని, సీఈవో వైద్యనాథన్ వేతనంలో 30 శాతం వదులుకునేందుకు ముందుకు వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. కాగా, ఉద్యోగుల ఒక రోజు వేతన మొత్తం రూ. 3.29 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వగా, బ్యాంకు రూ. 5 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios